వెల్లింగ్టన్: భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ చేయగా.. రాస్ టేలర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జోడి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని కివీస్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. హాఫ్ సెంచరీ ముందర టేలర్ పెవిలియన్ చేరినా.. విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కివీస్ కోల్పోయిన మూడు వికెట్లను పేసర్ ఇషాంత్ శర్మ తీసాడు.
కోహ్లీని ఔట్ చేసేందుకు బలహీనతలు వెతకలేదు.. ఎలా ఔట్ చేశానంటే: జేమీసన్
రెండో రోజు మొదటి ఇన్నింగ్స్ మొదలెట్టిన కివీస్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఇషాంత్ శర్మ బౌలింగ్లో ఓపెనర్ టామ్ లాథమ్ (11) షాట్కు యత్నించి రిషభ్ పంత్ చేతికి చిక్కాడు. టామ్ బ్లండెల్కు విలియమ్సన్ జత కలవడంతో కివీస్ ఇన్నింగ్స్ గాడిలో పడింది. అయితే కుదురుకున్న టామ్ బ్లండెల్ (30)ను ఇషాంత్ బోల్తా కొట్టించాడు. ఓ అద్భుతమైన బంతితో క్లీన్బౌల్డ్ చేశాడు.
రెండు వికెట్లు కోల్పోయిన అనంతరం విలియమ్సన్కు టేలర్ అండగా నిలిచాడు. ఈ జోడి భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 83 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. ఇక టేలర్ కూడా అర్ధ సెంచరీకి చేరువయ్యాడు. ఈ సమయంలో ఇషాంత్ కివీస్ను మరోసారి దెబ్బ కొట్టాడు. సిరీస్ ఆసాంతం ఫామ్లో ఉన్న టేలర్ను పెవిలియన్ చేర్చాడు. దీంతో కివీస్ మూడో వికెట్ కోల్పోయింది.
టేలర్ ఔట్ అయినా విలియమ్సన్ మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుత క్రీజులో విలియమ్సన్ (78), హెన్రి నికోల్స్ (2) ఉన్నారు. ఇప్పటికే కివీస్ 7 పరుగుల ఆధిక్యంలోకి వెళ్ళింది. ప్రస్తుతం కివీస్ 57 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఇషాంత్ శర్మకు మూడు వికెట్లు దక్కాయి.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 122/5తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్ 43 పరుగులే చేసి చివరి 5 వికెట్లు కోల్పోయింది. భారత బ్యాట్స్మెన్లో రహానె (46), మయాంక్ అగర్వాల్ (34) ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో జేమీసన్ (4/39), సౌథీ (4/49) రాణించారు.