India vs New Zealand: 'పాండ్యా రాకతో జట్టులో సమతూకం'

హైదరాబాద్: నిషేధం ఎత్తివేత తర్వాత టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. సోమవారం న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో పాండ్యా అద్భుత ప్రదర్శన చేయడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే కెప్టెన్ కోహ్లీ పాండ్యా ప్రదర్శనపై కొనియాడగా, తాజాగా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం పాండ్యాను ఆకాశానికెత్తేశాడు.
పాండ్యా రాకతో భారత జట్టుకు సమతూకం వచ్చిందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్యూలో గవాస్కర్ మాట్లాడుతూ "పాండ్యా ప్రదర్శన నిజంగా అద్భుతం. అద్భుతమైన ప్రదర్శనతో పాండ్యా ఆకట్టుకున్నాడు. అందుకే పాండ్యాని జట్టులో ఉండాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంది" అని చెప్పుకొచ్చాడు.
"పాండ్యా రాకతో జట్టులో సమతూకం వచ్చింది. జట్టుకు కావాల్సిన మిగతా అవసరాలన్నీ పాండ్యా తీర్చాడు. పాండ్య చక్కటి లైన్లో బౌలింగ్ చేశాడు. బౌన్సర్లను చక్కగా ఉపయోగించుకున్నాడు. మైదానంలో అతడి కదలికలు అమోఘం. జట్టుకు పాండ్యా తెచ్చే సానుకూలత అది. హార్దిక్ తిరుగులేని ఫీల్డర్" అని గవాస్కర్ తెలిపాడు.
"అతను అద్భుతమైన క్యాచ్లను కూడా అందుకోగలడు. మూడో వన్డేలో కేన్ విలియమ్సన్ క్యాచ్ని పాండ్యా అందుకున్న తీరు నిజంగా అభినందనీయం. రనౌట్లు చేస్తాడు. అటు బ్యాటుతోనూ ఇటు బంతితోనూ చక్కటి ప్రదర్శన చేయగలడు" అని గవాస్కర్ అన్నాడు. మూడో వన్డేలో కీలక సమయంలో రాణించిన పాండ్యా తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.
'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు కారణంగా న్యూజిలాండ్తో తొలి రెండు వన్డేలకు దూరమైన పాండ్యా మూడో వన్డేలో విజయ్ శంకర్ స్థానంలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. టాక్ షో వివాదంపై క్షమాపణలు చెప్పిన తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉన్న పాండ్యా మూడో వన్డేలో భారత్ విజయం సాధించిన తర్వాత ట్విట్టర్లో 'Thank you' అంటూ పోస్ట్ పెట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications