
చహల్, అయ్యర్ స్టెప్పులు:
విదేశీ గడ్డపై భారత జట్టు టీ20 సిరీస్లను మూడోసారి వైట్వాష్ చేసిన సందర్భంగా అభిమానులు, ఆటగాళ్లు డ్యాన్సులతో విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు యజువేంద్ర చహల్, శ్రేయస్ అయ్యర్ మైదానంలో ప్రత్యేక డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. పక్కనే ఉన్న లోకేష్ రాహుల్, సంజు సాంసన్, రవీంద్ర జడేజాలు వీరి విక్టరీ స్టెప్పులు చూస్తూ ఉండిపోయారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఒకవైపు అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుండగా.. మరోవైపు ఆటగాళ్లు సందడి చేసారు.

విక్టరీ డ్యాన్స్:
చహల్, అయ్యర్ స్టెప్పులకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ జట్టు తన అధికారిక ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. 'విక్టరీ డ్యాన్స్' అనే క్యాప్షన్ను రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియో అనేక లైకులు, షేర్లు సంపాదించింది. వీడియోను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 'సూపర్ డాన్స్' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'చహల్ నువ్ కేక' అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు.

చహల్ టిక్టాక్:
న్యూజిలాండ్ టూర్లో తోటి క్రికెటర్లతో కలిసి చహల్ ఓ టిక్టాక్ వీడియో చేశాడు. 'ఆఫ్ ఫీల్డ్ పెర్ఫార్మెన్స్' అంటూ ట్విటర్లో షేర్ చేసిన వీడియోకు ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన లభించింది. అయితే ఆ వీడియోలో యువ ఆటగాళ్లు చహల్, అయ్యర్, శివమ్ దూబేలతో పాటు క్యాప్ పెట్టుకుని.. ముఖం దాచుకున్న క్రికెటర్ను గుర్తుపట్టడం మాత్రం తమకు కష్టంగా మారిందంటూ కామెంట్లు చేశారు.
రాహుల్కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్':
టీ20 సిరీస్ ఆసాంతం బ్యాటింగ్తో చెలరేగిన లోకేష్ రాహుల్కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్', పునరాగమనంలో పేస్తో చెలరేగిన జస్ప్రీత్ బుమ్రాకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులు దక్కాయి. ఇక కివీస్తో జరుగనున్న మూడు వన్డేల సిరీస్కు టీమిండియా సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 5న హామిల్టన్లో తొలి మ్యాచ్ జరగనుంది.


Click it and Unblock the Notifications
