హైదరాబాద్: పూణె వన్డేలో పిచ్ని చూసి తాను వ్యూహం మార్చినట్లు టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు. బుధవారం న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టుని భారత బౌలర్లు భువనేశ్వర్ (3/45), జస్ప్రీత్ బుమ్రా (2/38), చాహల్ (2/36), జాదవ్ (0/31) కట్టుదిట్టమైన బౌలింగ్తో కట్టడి చేయడంతో పర్యాటక జట్టు నిర్ణీతో ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్లో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ 45 పరుగులిచ్చాడు. అయితే ఆరంభంలోనే ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (11), కొలిన్ మున్రో (10) వికెట్లతో పాటు మిడిల్ ఓవర్లలో హెన్రీ నికోలస్ (42) వికెట్ తీశాడు. భువీ తీసిన మూడు వికెట్లు కీలక ఆటగాళ్లవి కావడం విశేషం.
మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ 'మ్యాచ్ ఆరంభంలో కొత్త బంతితో బౌలింగ్ చేసేటప్పుడు సాధారణంగా నేను స్వింగ్ రాబట్టేందుకు ఎక్కువ ప్రయత్నిస్తుంటాను. అయితే పూణె పిచ్ నుంచి నేను ఆశించిన మేర స్వింగ్కి సహకారం లభించలేదు. దీంతో నా వ్యూహాన్ని మార్చాను' అని అన్నాడు.
'పూణె వన్డేలో గుడ్ లెంగ్త్ ప్రదేశంలో బంతులు విసిరాను. దీంతో కివీస్ బ్యాట్స్మెన్ ఆరంభంలోనే పెవిలియన్కు చేరారు. మైదానంలో ఆత్మవిశ్వాసంతో ఉంటే.. ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఇక్కడ టీమ్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలి' అని భువనేశ్వర్ చెప్పాడు.
'ఎందుకంటే గతంతో పోలిస్తే ఆటగాళ్లను ఫిటెనెస్పై దృష్టి సారించేలా మేనేజ్మెంట్ ప్రస్తుతం ప్రోత్సహిస్తోంది. తద్వారా నా ప్రదర్శన కూడా మునుపటి కంటే ఎంతో మెరుగైంది' అని భువనేశ్వర్ కుమార్ వెల్లడించాడు. కాగా, రెండో వన్డేలో భువనేశ్వర్ కుమార్కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించిన సంగతి తెలిసిందే.
కాగా, మూడు వన్డేల సిరిస్లో ఇరు జట్లు ఇప్పటికే 1-1తో సమంగా ఉన్నాయి. సిరిస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే ఆదివారం (అక్టోబర్ 29)న కాన్పూర్ వేదికగా జరగనుంది.