
253 పరుగుల విజయ లక్ష్యంతో
253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 44.1 ఓవర్లలోనే 217 పరుగులకి కుప్పకూలింది. దీంతో రోహిత్ సేన 35 బంతులు మిగిలి ఉండగానే 35 పరుగులతో విజయం సాధించింది. ఓపెనర్లు హెన్రీ నికోల్స్(8), కొలిన్ మున్రోలను ఆరంభంలోనే షమీ పెవిలియన్కు చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్ను పాండ్యా ఎల్బీగా పెవిలియన్కు చేర్చాడు.

ఐదో వికెట్కు 67 పరుగుల భాగస్వామ్యం
ఈ క్రమంలో లాథమ్(37), విలియమ్సన్(39)లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. క్రీజులో పాతుకుపోతూ ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని పార్ట్టైమ్ బౌలర్ కేదార్ జాదవ్ విడగొట్టాడు. కేదార్ జాదవ్ బౌలింగ్లో కెప్టెన్ విలియమ్సన్(39) శిఖర్ ధావన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేర్చాడు. దీంతో ఐదో వికెట్కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

స్వీప్ చేసేందుకు ప్రయత్నించిన నీషమ్
ఆ తర్వాత కొద్దిసేపటికే లాథమ్(37), గ్రాండ్హోమ్(11)లను చైనామన్ చాహల్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మరో 41 పరుగుల అనంతరం జేమ్స్ నీషమ్(44) రనౌట్గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్లో బంతిని స్వీప్ చేసేందుకు నీషమ్ ప్రయత్నించాడు. అయితే, అతడి శరీరాన్ని తాకిన బంతి ధోని పక్క నుంచి వికెట్లకి దూరంగా వెళ్లింది.
ధోని త్రోని ఊహించలేకపోయిన నీషమ్
బంతి ఎక్కడికి వెళ్లిందోనని తెలుసుకునేందుకు కొన్ని క్షణాల సమయం తీసుకున్నాడు. అదే సమయంలో వికెట్ల వెనుకన ఉన్న బంతిని చూసి పరుగు కోసం సాహసోపేతంగా క్రీజు వెలుపలికి వెళ్లాడు. అయితే.. అప్పటికే బంతిని అందుకున్న ధోని రెప్పపాటులో దానిని వికెట్లపైకి విసిరాడు. ధోని త్రోని ఊహించలేకపోయిన నీషమ్ పేలవంగా రనౌటై నిరాశగా పెవిలియన్కు చేరాడు.
రాయుడికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శాంట్నర్(22), అస్లే(10), బోల్ట్(1)ల వికెట్లు కూడా త్వరగా కోల్పోవడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లలో జేమ్స్ నీషమ్ (44), విలియమ్సన్ (39)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో చాహల్ (3/41), మహ్మద్ షమీ (2/35), హార్దిక్ పాండ్యా (2/50) అద్భుత ప్రదర్శన చేశారు. ఐదో వన్డేలో 90 పరుగులు చేసిన రాయుడికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

షమీకి ప్లేయర్ ఆఫ్ ద సిరిస్ అవార్డు
టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ద సిరిస్ అవార్డు లభించింది. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో అంబటి రాయుడు (90: 113 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు), హార్దిక్ పాండ్యా (45: 22 బంతుల్లో 2 ఫోర్లు, 5సిక్సులు) మెరుపులు మెరిపించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు, నీషమ్ ఒక వికెట్ తీసుకున్నారు.


Click it and Unblock the Notifications

