
హైదరాబాద్: సూపర్ ఓవర్ న్యూజిలాండ్ జట్టుకు కలిసి రాలేదు. ఐదు టీ20ల సిరిస్లో భాగంగా బుధవారం హామిల్టన్ వేదికగా జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ సూపర్ ఓవర్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అంతకముందు ఇరు జట్ల స్కోరు సమం కావడంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడించారు.
సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ తరఫున కెప్టెన్ కేన్ విలియమ్సన్, మార్టిన్ గుప్టిల్ బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ కలిసి రెండు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 17 పరుగులు చేశారు. అనంతరం న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ సూపర్ ఓవర్ వేశాడు. అయితే, సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ రెండు సిక్సులతో చెలరేగి భారత్కు విజయాన్నందించాడు.
ఫలితంగా న్యూజిలాండ్ సూపర్ ఓవర్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరింట ఓడిపోయింది. ఈ ఐదు మ్యాచ్ల్లో నాలుగు సార్లు కివీస్ పేసర్ టిమ్ సౌథీతో సూపర్ ఓవర్ వేయించడం విశేషం. 2010లో ఆసీస్తో జరిగిన మ్యాచ్ కూడా టై అయింది. దీంతో ఈ మ్యాచ్లో టిమ్ సౌథీ సూపర్ వేశాడు. ఈ మ్యాచ్లో సౌథీ 6 పరుగులివ్వడంతో కివీస్ విజయం సాధించింది.
ఆ తర్వాత 2012లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 13 పరుగులు... అదే ఏడాది విండిస్తో జరిగిన మ్యాచ్లో 19 పరుగులు... 2019లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 17 పరుగులు.... 2020లో ఇండియాతో జరిగిన మ్యాచ్లో 20 పరుగులు సమర్పించుకోవడంతో న్యూజిలాండ్ ఓడిపోయింది.
మరోవైపు, సూపర్ ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లలో న్యూజిలాండ్ బౌలర్ డానియేల్ వెటోరి(25) పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత ఈ జాబితాలో టిమ్ సౌథీ(20), క్లాసెన్(19), బుమ్రా(17), శామ్యూల్స్(17) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇక, అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా సూపర్ ఓవర్ ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధించింది. 2007 టీ20 వరల్డ్కప్లో డర్బన్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన ఫైనల్లో సూపర్ ఓవర్లో విజయం సాధించిన టీమిండియా తొలి సారి టీ20 వరల్డ్కప్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగుల చేసింది.