
బెంగళూరు: న్యూజీలాండ్ లో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయానికి ఒక మ్యాచ్ దూరంలో ఉంది. కివీస్ జట్టును వారి సొంత గడ్డపై అటు వన్డేల్లోనూ, ఇటు టీ20ల్లోనూ ఓడించి చరిత్ర సృష్టించడానికి సన్నద్ధమైంది. అయిదు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను 4-1తో గెలుచుకుంది భారత జట్టు. వన్డే సిరిస్ ఘోర పరాజయం పాలైనప్పటికీ.. తొలి టీ20 మ్యాచ్ లో న్యూజీలాండ్ తన సత్తా చాటింది. టీ 20ల్లో అరుదైన రికార్డును నమోదు చేసింది. 219 పరుగులు చేసి టీమిండియాను ఖంగు తినిపించింది.
ఆ మ్యాచ్ లో 132 పరుగులకే ఓటమి పాలైంది భారత జట్టు. రెండో టీ20లో పుంజుకొంది. న్యూజీలాండ్ పై ఘన విజయం సాధించింది. తొలుత బౌలింగ్ చేసిన రోహిత్ సేన కివీస్ ను 158 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగి మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి, లక్ష్యాన్ని అందుకుంది. ఇక చివరిదైన మూడో మ్యాచ్ పై కన్నేసింది. ఈ మ్యాచ్ ను నెగ్గి టీ20 సిరీస్ ను కూడా తన ఖాతాలో వేసుకోవడానికి సన్నద్ధమౌతోంది. చివరి టీ20కి హామిల్టన్ ఆతిథ్యం ఇస్తోంది.
ఆదివారం జరిగే ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. తొలి టీ20లో ధారాళంగా పరుగులను ఇచ్చిన బౌలర్లు.. రెండో మ్యాచ్ లో పుంజుకున్నారు. దీనితో బౌలింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. రెండో టీ20ని ఆడిన జట్టే.. ఆదివారం నాటి చివరి టీ20లోనూ ఉంటుందని జట్టు మేనేజర్ చెబుతున్నారు.
రోహిత్ శర్మ కేప్టెన్ గా వ్యవహరించే ఈ జట్టులో శిఖర్ ధవన్, రిషభ్ పంత్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ, దినేష్ కార్తిక్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, ఖలీల్ అహ్మద్ లను ఆడిస్తారని మేనేజర్ చెబుతున్నారు. పిచ్ స్వభావాన్ని బట్టి తుది జట్టులో మార్పులు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటే ఖలీల్ కు బదులుగా మరో స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ ను తుది జట్టులో తీసుకునే అవకాశాలు ఉన్నాయి.