
కోల్కత: టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈ సాయంత్రం భారత క్రికెట్ జట్టు.. ఈ సాయంత్రం న్యూజిలాండ్తో తలపడనుంది. ఇదే చివరి మ్యాచ్. 25వ తేదీ నుంచి ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ మొదలు కానుంది. ఇప్పటికే రెండు మ్యాచ్లను తన ఖాతాలో వేసుకుంది టీమిండియా. ఈడెన్ గార్డెన్స్లోనూ తన జైత్రయాత్రను కొనసాగించడానికి రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. సిరీస్ను కైవసం చేసుకున్న నేపథ్యంలో కొన్ని ప్రయోగాలకు పూనుకుంది. టెస్ట్ సిరీస్ కోసం సీనియర్లకు విశ్రాంతిని ఇచ్చి, ఐపీఎల్ స్టార్లను ఆడించబోతోంది.
ఈ మ్యాచ్ కూడా గెలిస్తే.. టీమిండియా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించే టీ20 ప్రపంచకప్ ర్యాంకింగ్స్లల్లో అగ్రస్థానానికి చేరుకుంటుందా? దానికి అవకాశాలు ఉన్నాయా? టాప్ ప్లేస్కు చేరుకోవాలంటే ఎన్ని పాయింట్లు అవసరమౌతాయి.. అనే ఈక్వేషన్లపై డిబేట్ సాగుతోంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై. పూర్తిస్థాయి కేప్టెన్గా తాను ఎదుర్కొన్న తొలి సిరీస్లోనే భారత్కు విజయాలను అందించడంతో పాటు ఐసీసీ టీ20 ప్రపంచ ర్యాంకింగ్స్లో కింగ్గా నిలబెట్టే అవకాశం రోహిత్ శర్మకు దక్కుతుందా? అనేది వాటి సారాంశం.
ప్రస్తుతం టీ20 ఫార్మట్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇవాన్ మోర్గాన్ సారథ్యంలోని ఆ జట్టు ఖాతాలో ఉన్న పాయింట్ల సంఖ్య 278. రెండో స్థానంలో భారత్ కొనసాగుతోంది. భారత్ వద్ద ఉన్నవి 264 పాయింట్లు. మూడో స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఆ జట్టుకు ఉన్న పాయింట్లు 263. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు సంబంధించిన పాయింట్లు ఇంకా జత చేయాల్సి ఉంది. వాటిని కలపలేదు. ఇక మూడో టీ20ని కూడా గెలిచినా.. భారత జట్టు వరల్డ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకోలేదు.
పాయింట్ల మధ్య ఆంతర్యాన్ని తగ్గిస్తుందే తప్ప తన ర్యాంక్ను మెరుగుపర్చుకోలేదు. రెండో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం భారత జట్టు వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మట్లోనూ వరల్డ్ ర్యాంకింగ్స్ల్లో రెండో స్థానంలోనే కంటిన్యూ అవుతోంది. న్యూజిలాండ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నాలుగో స్థానంలో కొనసాగుతోన్న ఈ జట్టు ఈ మ్యాచ్ను కూడా కోల్పోయిందంటే..ర్యాంకింగ్స్లో మరింత దిగజారుతుంది. అయిదో స్థానం కంటే దిగువకు చేరుకోవచ్చు.
భారత్ ఓడిపోతే.. దాయాది జట్టు పాకిస్తాన్.. రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఉన్నది ఒక్క పాయింట్ తేడా మాత్రమే. ప్రస్తుత పాకిస్తాన్.. బంగ్లాదేశ్లో పర్యటిస్తోంది. భారత్ తరహాలోనే బంగ్లాపై తొలి రెండు టీ20 మ్యాచ్లల్లో ఘన విజయాన్ని అందుకుంది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉంది. అందులో పాకిస్తాన్ గెలిచి.. భారత్- గనక న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే.. ఐసీసీ వరల్డ్ ర్యాంకింగ్స్లో తన స్థానాన్ని పాకిస్తాన్కు ధారదాత్తం చేసుకున్నట్టే అవుతుంది.