హైదరాబాద్: 'కోహ్లీ భాయ్ టెన్షన్ వద్దు.. నేను బౌలింగ్ చేసి మ్యాచ్ను గెలిపిస్తా. నువ్వు చింతించకు' తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టీ20 ఆఖరి ఓవర్లో న్యూజిలాండ్ ఆటగాడు గ్రాండ్ హోమ్ సిక్సు కొట్టిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా చెప్పిన మాటలివి.
న్యూజిలాండ్తో మంగళవారం జరిగిన చివరి టీ20లో కోహ్లీసేన 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి న్యూజిలాండ్పై టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. వర్షం కారణంగా ఈ మ్యాచ్ని 8 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే.

దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. అనంతరం భారత్ నిర్దేశించిన 68 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ నిర్ణీత 8 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో చివరి ఓవర్లో న్యూజిలాండ్ విజయానికి 19 పరుగులు కావాలి. ఈ దశలో విరాట్ కోహ్లీ బంతిని పాండ్యాకు అప్పగించాడు. మొదటి బంతి స్లో బంతిగా పాండ్యా చివరి ఓవర్ను ప్రారంభించాడు. మొదటి బంతికి బై రూపంలో పరుగు కోసం ప్రయత్నించిన మిచెల్ శాంట్నర్ ఔట్ అవ్వడం అభిమానులు ఆనందంలో మునిగారు.
ఇక, రెండో బంతి తర్వాత మైదానంలో డ్రా చోటు చేసుకుంది. పాండ్యా విసిరిన ఈ బంతిని కివీస్ బ్యాట్స్మన్ కలిన్ డీ గ్రాండ్హామ్ స్ట్రయిట్ షాట్ బాదాడు. తనైవైపు దూసుకొచ్చిన బంతిని క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించిన పాండ్యా చేతివేలికి గాయమైంది. దీంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది.
వెంటనే జట్టు ఫిజియో నిపుణుడు ప్యాట్రిక్ ఫర్హర్ట్ మైదానంలోకి వచ్చి పాండ్యాకు ప్రాధమిక చికిత్స చేశాడు. దీంతో ఫిట్ అయిన పాండ్యా చివరి ఓవర్ను విజయవంతంగా పూర్తిచేశాడు. మూడో బంతిని గ్రాండ్హోమ్ భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో కోహ్లీ కూడా ఒకింత ఆందోళనకు గురయ్యాడు.
మ్యాచ్ చేజారనుందా? అనే భావనకు వచ్చాడు. దీంతో హార్ధిక్ పాండ్యాకు దగ్గరకు వచ్చిన కోహ్లీకి ఊహించని సమాధానం ఎదురైందట. 'కోహ్లీ భాయ్ టెన్షన్ వద్దు.. నేను బౌలింగ్ చేసి మ్యాచ్ను గెలిపిస్తా. నువ్వు చింతించకు' అని హార్దిక్ ధైర్యం చెప్పినట్లు' మ్యాచ్ అనంతరం కోహ్లీ స్వయంగా వెల్లడించాడు.
'ఒక కెప్టెన్గా నాకు ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది. మన బౌలర్లలో ఈ తరహా నమ్మకం ఉండటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. హార్దిక్ సామర్థ్యంపై అతను నమ్మకంగానే ఉన్నాడనే విషయం నాకు అప్పుడు అర్ధమైంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ చక్కటి ఫినిషింగ్ ఇచ్చాడు. భారత జట్టులో బౌలర్లు ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేయడం వల్లే ఉత్కంఠ మ్యాచ్ల్లో విజయం సాధిస్తున్నాం' అని కోహ్లీ అన్నాడు.