
మౌంట్ మాంగనూయ్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. 63 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 1 పరుగుకే పెవిలియన్ చేరగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (12 బంతుల్లో 9 పరుగులు; 1 ఫోర్) మరోసారి విఫలమయ్యాడు. బెనెట్ బౌలింగ్లో జేమీసన్కు క్యాచ్ ఇచ్చి విరాట్ వెనుదిరిగాడు. మయాంక్ బోల్డ్ కాగా.. కోహ్లీ క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
తొలి వన్డేలో 51 పరుగులు చేసి రాణించిన విరాట్ కోహ్లీ, రెండో వన్డేలో 15 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇక మాయాంక్ అగర్వాల్ తొలి వన్డేలో 32 పరుగులతో రాణించగా.. రెండో వన్డేలో 3 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మూడో వన్డేలో 9 బంతులు ఆడి పెవిలియన్ చేరాడు. ఓపెనర్ రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన మాయాంక్ పూర్తిగా విఫలమయ్యాడు. ఈ ప్రదర్శనతో మరోసారి అవకాశం దక్కడం అసాధ్యమే.
మయాంక్, కోహ్లీ పెవిలియన్ అనంతరం మరో యువ ఓపెనర్ పృథ్వీ షా మెరుపులు మెరిపించాడు. శ్రేయస్ అయ్యర్ అండతో బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు వేగం పెంచాడు. అయ్యర్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ షాకు సహకారం అందించాడు. పృథ్వీ షా (40: 42 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) అనూహ్యంగా రనౌట్ కావడంతో భారత్ మూడో వికెట్ చేజార్చుకుంది. బెనెట్ వేసిన 13వ ఓవర్లో రెండో పరుగు కోసం ప్రయత్నించి షా రనౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కివీస్ పేసర్లు భారత్ను గట్టి దెబ్బకొట్టడంతో టీమిండియా ఒత్తిడిలో పడింది.
శ్రేయస్ అయ్యర్కు లోకేష్ రాహుల్ జతకలిశాడు. ఈ ఇద్దరు కివీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళుతున్నారు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ (27), కేఎల్ రాహుల్ (16) క్రీజులో ఉన్నారు. 19 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్లకు 95 పరుగులు చేసింది. 2-0తో సిరీస్ గెలుచుక్ను ఆతిథ్య న్యూజిలాండ్ టీ20 వైట్వాష్కు ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా.. నామమాత్రమైన మ్యాచ్లో గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.