ఓపెనర్లు మెరిసేనా:
టాప్ ఆర్డర్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. గాయాలతో సీనియర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు దూరమయిన నేపథ్యంలో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలు ఆడారు. షా వేగంగా షాట్లు ఆడుతున్నా.. భారీ ఇన్నింగ్స్ ఆడడంలో మాత్రం విఫలమవుతున్నాడు. మయాంక్ అగర్వాల్ తొలి వన్డేలో ఫర్వాలేదనిపించినా.. రెండో వన్డేలో విఫలమయ్యాడు. మూడో వన్డేలోనైనా ఈ యువ జోడి గాడిలో పడుతుందేమో చూడాలి. ఈ సిరీస్లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది.
కోహ్లీపైనే భారం:
ఓపెనర్లు విఫలమవుతుండడంతో పరుగుల భారమంతా కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే పడుతోంది. అయితే కివీస్ బౌలర్లు కోహ్లీని ఎక్కువ పరుగులు చేయకుండా ఆడుకుంటున్నారు. కోహ్లీ ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్, లోకేష్ రాహుల్ రాణించడం టీమిండియాకు కాస్త ఊరట కలిగించే విషయం. రెండో వన్డేలో విఫలమయిన రాహుల్.. గాడిలో పడితే తిరుగుండదు.
పాండేకు ఛాన్స్:
తొలి వన్డేలో ఆరో స్థానంలో ఆడిన కేదార్ జాదవ్ పర్వాలేదనిపించాడు. 15 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ.. కీలక రెండో వన్డేలో పరుగులు చేయలేక చేతులెత్తేశాడు. దీంతో జాదవ్ స్థానంలో మనీష్ పాండే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక న్యూజిలాండ్ గడ్డపై బౌలింగ్లో నిలకడగా రాణిస్తున్న రవీంద్ర జడేజా స్థానంకు ఎలాంటి డోకా లేదు. బ్యాటింగ్లో వచ్చిన అవకాశాన్ని చక్కగా ఒడిసిపట్టాడు. జట్టును గెలిపించే ప్రయత్నం చేసినా.. చివరలో పెవిలియన్ బాట పట్టాడు.
బుమ్రా ఔట్.. షమీ ఇన్:
వన్డే సిరీస్లో భారత బౌలింగ్ పేలవంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో మునుపటి పటిమ కనిపించడం లేదు. అతడి బంతుల్ని కివీస్ ఆటగాళ్లు సులభంగా ఆడేస్తున్నారు. బుమ్రా స్థానంలో మొహమ్మద్ షమీ రానున్నాడు. బంతి, బ్యాటుతో ఆకట్టుకున్న నవదీప్ సైనీకి తిరుగులేదు. శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్ చోటు దక్కించుకోనున్నారు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్, ఫీల్డింగ్లో నిరాశపరుస్తున్నాడు. చివరి మ్యాచులో అతడికి చోటు కష్టమే.
విలియమ్సన్ వచ్చేసాడు:
మరోవైపు న్యూజిలాండ్ ఉత్సాహంగా కనిపిస్తోంది. సిరీస్ క్లీన్స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ రావడంతో ఆ జట్టు బలం మరింత పెరిగింది. టిమ్ సౌథీ, మిచెల్ శాంట్నర్ కడుపునొప్పితో బాధపడుతున్నారు. స్కాట్ కుగులీన్కు వైరల్ జ్వరం. ముందు జాగ్రత్తగా స్పిన్నర్ ఇష్ సోధి, పేసర్ బ్లెయిర్ టిక్నెర్ను కివీస్ బోర్డు పిలిపించింది. మ్యాచ్ సమయానికి అందరూ కోలుకుంటే.. ఒక్క మార్పుకు మించి ఉండకపోవచ్చు.
పరుగుల వరద ఖాయం:
మౌంట్ మాంగనూయ్లో పరుగుల వరద ఖాయం. పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. చివరి ఐదు వన్డేల్లో స్పిన్నర్లు 80 వికెట్లు తీశారు. చివరి ఐదు వన్డేల్లో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 296. 2019లో భారత్ ఇక్కడ ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. ఇప్పటివరకు ఇక్కడ పది వన్డేలు జరగగా.. తొలుత బ్యాటింగ్ చేసినవి, ఛేదించినవి చెరో ఐదు గెలిచాయి.
భారత జట్టు (అంచనా):
పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ.