మౌంట్ మాంగనూయ్: భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో న్యూజిలాండ్ ఉత్సాహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కివీస్ 3-0తో సిరీస్ క్లీన్స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉంది. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి రావడంతో కివీస్ బలం మరింత పెరిగింది. మౌంట్ మాంగనూయ్లో మంగళవారం ఉదయం 7.30 గంటలకు చివరి వన్డే ప్రారంభం కానుంది. అయితే కివీస్ జట్టులో చాలామంది గాయపడటంతో ఇద్దరు ప్లేయర్లను స్క్వాడ్లోకి చేర్చింది.
IND vs NZ 3rd ODI Preview: జాదవ్, బుమ్రా ఔట్.. తుది జట్టు ఇదే?!!
మూడో వన్డేకు స్పిన్నర్ ఇష్ సోధి, పేసర్ బ్లెయిర్ టిక్నర్ న్యూజిలాండ్ జట్టుకు ఎంపికయ్యారు. టిమ్ సౌథీ, మిచెల్ శాంట్నర్, స్కాట్ కుగెలీన్ అనారోగ్యంగా ఉండటంతో వీరిద్దరిని ఆఖరి వన్డేకు ఎంపిక చేసినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తాజాగా తెలిపింది. ఇటీవల డ్రాగా ముగిసిన భారత్-ఎ×న్యూజిలాండ్-ఎ రెండో టెస్టులో సోధి, టిక్నర్ ఆడారు. అయితే నాలుగు, ఐదు రోజుల ఆటకు మాత్రం వీరు దూరంగా ఉన్నారు.
సౌథీ, శాంట్నర్ కడుపు నొప్పితో.. కుగెలీన్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి ఈ ముగ్గురు కివీస్ ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు. మ్యాచ్ సమయానికి వీరి పరిస్థితి ఎలా ఉంటుందో మరి. అలాగే రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో వన్డేకు అందుబాటులోకి రానున్నాడు. భుజం గాయంతో కేన్ టీ20 సిరీస్లోని ఆఖరి రెండు మ్యాచ్లతో పాటు వన్డే సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. విలియమ్సన్కు సోమవారం ఫిట్నెస్ టెస్టు నిర్వహించనున్నారు. దీనిలో ఫిట్ ఉన్నాడని నిరూపించుకుంటే అతడు ఆఖరి వన్డేలో బరిలోకి దిగే అవకాశం ఉంది.
మరోవైపు మూడో వన్డేలో భారత్ తమ తుది జట్టులో రెండు మూడు మార్పులు చేసే అవకాశముంది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో మునుపటి పటిమ కనిపించడం లేదు. అతడి బంతుల్ని కివీస్ ఆటగాళ్లు సులభంగా ఆడేస్తున్నారు. బుమ్రా స్థానంలో మొహమ్మద్ షమీ రానున్నాడు. తొలి వన్డేలో ఆరో స్థానంలో ఆడిన కేదార్ జాదవ్ పర్వాలేదనిపించాడు. 15 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ.. కీలక రెండో వన్డేలో పరుగులు చేయలేక చేతులెత్తేశాడు. దీంతో జాదవ్ స్థానంలో మనీష్ పాండే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఫామ్లో ఉన్న పాండేని పక్కన పెట్టి జాదవ్కి వరుసగా అవకాశాలిచ్చినా నిరూపించుకోలేకపోయాడు. దీంతో మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్లోనూ జాదవ్ ఎంపికవడం అనుమానమే.