మౌంట్ మాంగనూయ్: న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్మన్ లోకేష్ రాహుల్ సెంచరీ నమోదు చేసాడు. 104 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో రాహుల్ ఓ రికార్డును నమోదు చేశాడు. కివీస్ గడ్డపై 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్మెన్గా రాహుల్ రికార్డు సృష్టించాడు. 2015లో న్యూజిలాండ్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో సీనియర్ ఆటగాడు సురేష్ రైనా (110) సెంచరీ చేసి తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు.
అయ్యర్, రాహుల్ హాఫ్ సెంచరీలు.. భారత్ స్కోర్ 213/4!!
టాస్ గెలిచిన న్యూజిలాండ్ కోహ్లీసేనను బ్యాటింగ్కు ఆహ్వానించగా.. 32 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (9) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. కైల్ జెమీసన్ బౌలింగ్లో మయాంక్ బోల్డ్ కాగా.. బెనెట్ బౌలింగ్లో జేమీసన్కు క్యాచ్ ఇచ్చి విరాట్ వెనుదిరిగాడు. దీంతో 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది.
ఈ దశలో క్రీజులో కుదురుకున్న మరో ఓపెనర్ పృథ్వీ షా (42 బంతుల్లో 40; ఫోర్లు 3, సిక్స్లు 2) మెరుపులు మెరిపించాడు. శ్రేయస్ అయ్యర్ అండతో బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు వేగం పెంచాడు. మరోవైపు అయ్యర్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ.. షాకు సహకారం అందించాడు. కుదురుకున్న షా అనూహ్యంగా రనౌట్ కావడంతో భారత్ మూడో వికెట్ చేజార్చుకుంది. బెనెట్ వేసిన 13వ ఓవర్లో రెండో పరుగు కోసం ప్రయత్నించి షా రనౌట్ అయ్యాడు. పృథ్వీ డైవ్ చేసినా ఫలితం లేకపోయింది.
భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో ఓపికగా క్రీజులో పాతుకుపోయిన అయ్యర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. కేఎల్ రాహుల్ సాయంతో అయ్యర్ స్కోరు బోర్డును పరుగు పెట్టించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 8వ హాఫ్సెంచరీ పూర్తి చేసాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో అయ్యర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రాహుల్ హాఫ్ సెంచరీ చేసాడు. అతనికి మనీష్ పాండే చక్కటి సహకారం అందించాడు.
హాఫ్ సెంచరీ తర్వాత ధాటిగా ఆడుతూ రాహుల్ సెంచరీ చేసాడు. మరోవైపు పాండే కూడా దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ సమయంలో కివీస్ పేసర్ బెనెట్ దెబ్బకొట్టాడు. 47వ ఓవర్ వేసిన బెనెట్ వరుస బంతుల్లో రాహుల్ (112), పాండే (42) లను ఔట్ చేసాడు. ఇక 49వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ (7)ను కూడా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా (2), నవదీప్ సైనీ (4) క్రీజులో ఉన్నారు. 48.3 ఓవర్లు ముగిసేసరికి భారత్ 7 వికెట్లకు 284 పరుగులు చేసింది.