244 పరుగుల లక్ష్యంతో బరిలోకి టీమిండియా
న్యూజిలాండ్ నిర్దేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాట్స్మెన్ ఆడుతూ పాడుతూ ఛేదించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించారు. ధావన్ బౌండరీలతో స్కోరును పరుగులు పెట్టించాడు. కాగా, జట్టు స్కోరు 39 పరుగుల వద్ద ఉండగా ధావన్(28; 27 బంతుల్లో 6 ఫోర్లు) తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు.
కోహ్లీ, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలు
అనంతరం వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(60)తో కలిసి రోహిత్ శర్మ (62) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ తన కెరీర్లో 39వ హాఫ్ సెంచరీని నమోదు చేయగా, మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కోహ్లీకి వన్డేల్లో ఇది 49వ హాఫ్ సెంచరీ కావడం విశేం. వీరిద్దరూ 113 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత రోహిత్ రెండో వికెట్గా ఔటయ్యాడు.
100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ-రోహిత్
తర్వాత కొద్ది సేపటికే జట్టు స్కోరు 168 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ రూపంలో మూడో వికెట్ను నష్టపోయింది. వన్డేల్లో రోహిత్-విరాట్ ద్వయం 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇది 16వసారి. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు-దినేశ్ కార్తీక్ల జంట నిలకడగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.
చివర్లో రాణించిన రాయుడు-కార్తీక్ జోడీ
అంబటి రాయుడు(40 నాటౌట్; 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్), దినేశ్ కార్తీక్(38 నాటౌట్; 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించడంతో భారత్ 43 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో
ట్రెంట్ బౌల్ట్ రెండు, మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ తీశారు.
243 పరుగులు చేసిన న్యూజిలాండ్
అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లలో రాస్ టేలర్ (93), టామ్ లాథమ్ (51) రాణించడంతో కివీస్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ(3/41), భువనేశ్వర్ కుమార్(2/46), హార్డిక్ పాండ్యా(2/45), యజువేంద్ర చాహల్(2/51) విజృంభించారు.