
మౌంట్ మాంగనూయ్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ విజయం దిశగా దూసుకుకెళుతోంది. భారత్ నిర్ధేశించిన 297 పరుగుల లక్ష్య సాధనలో కివీస్ విజయానికి చేరువైంది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ (46 బంతుల్లో 66: 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రీ నికోల్స్ (103 బంతుల్లో 80: 9 ఫోర్లు) అద్భుతంగా ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్కు 106 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆపై కెప్టెన్ కేన్ విలియమ్సన్ (22) నెమ్మదిగా ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేయగా.. టామ్ లాతమ్, కొలిన్ డి గ్రాండ్హోమ్ న్యూజిలాండ్ను విజయం దిశగా తీసుకెళుతున్నారు.
297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఓపెనర్లు మంచి శుభారంభం ఇచ్చారు. గప్తిల్ మొదటి ఓవర్ నుండే బౌండరీల మోత మొదలెట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీలను ధీటుగా ఎదుర్కొంటూ సునాయాసంగా పరుగులు చేసాడు. సైనీ వేసిన ఆరో ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన గప్తిల్.. బుమ్రా వేసిన ఏడవ ఓవర్లో మరో ఫోర్, సిక్స్ బాదాడు. యుజువేంద్ర చహల్, ఠాకూర్లను కూడా వదలలేదు. ఈ క్రమంలోనే 29 బంతుల్లో గప్తిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు.
మరోవైపు హెన్రీ నికోల్స్ ఆచితూచి ఆడుతూ గప్తిల్కు మంచి సహకారం అందించాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ గప్తిల్కు అండగా నిలిచాడు. హాఫ్ సెంచరీ అనంతరం గప్తిల్ మరింత రెచ్చిపోయాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో చహల్ వేసిన 17వ ఓవర్ మూడో బంతికి గప్తిల్ (66) బోల్డ్ అయ్యాడు. దీంతో 106 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (22) నెమ్మదిగా ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో చాహల్ బౌలింగ్లో షాట్ ఆడబోయి మయాంక్ అగర్వాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
వికెట్లు పడుతున్నా హెన్రీ నికోల్స్ మాత్రం భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ చేసాడు. ఇక సిరీస్లో అత్యద్భుతంగా రాణించిన రాస్ టేలర్ (12) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. మరో మూడు పరుగుల అనంతరం నికోల్స్ ఔట్ అయ్యాడు. కొద్దిసేపు ఆకట్టుకున్న జిమ్మీ నీషమ్ (19) కూడా పెవిలియన్ చేరడంతో కివీస్ ఐదు వికెట్లు కోల్పోయింది.
ఈ సమయంలో టామ్ లాతమ్ అద్భుతంగా ఆడి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. మరోవైపు కొలిన్ డి గ్రాండ్హోమ్ కూడా బ్యాట్ జులిపించాడు. ఈ జోడి వేగంగా పరుగులు చేస్తూ న్యూజిలాండ్ను విజయం దిశగా తీసుకెళుతున్నారు. ప్రస్తుతం క్రీజులో లాతమ్ (31), గ్రాండ్హోమ్ (47) ఉన్నారు. కివీస్ 45 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.