3-0తో ఓటమిని జీర్ణించుకోవడం కష్టం
"3-0తో ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. భారత జట్టును ప్రశంసించాల్సిందే. మూడు మ్యాచుల్లోనూ అద్భుతంగా ఆడారు. మాకన్నా ఎంతో మీద ఉన్నారు. మాపై ఒత్తిడి పెంచి కీలక సమయాల్లో వికెట్లు తీశారు. మేం ఆధిపత్యం వహించే స్థితిలో పట్టు కోల్పోయాం. మేం పోరాడినప్పటికీ ఫలితం లేదు" అని రాస్ టేలర్ అన్నాడు.
59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో
మూడో వన్డేలో 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును మిడిలార్డర్ బ్యాట్స్మెన్ రాస్ టేలర్(81), టామ్ లాథమ్(51) ఆదుకున్నారు. ఈ జోడీ నాలుగో వికెట్కి 119 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలోనే ముందుగా రాస్ టేలర్ హాఫ్ సెంచరీ చేయగా, లాథమ్ కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత లాథమ్ నాలుగో వికెట్గా పెవిలియన్కు చేరాడు.
షమీ బౌలింగ్లో ఏడో వికెట్గా పెవిలియన్కు చేరిన టేలర్
భారత స్పిన్నర్ చహల్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన లాథమ్.. అంబటి రాయుడుకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరో 13 పరుగుల వ్యవధిలో హెన్రీ నికోలస్(6)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వేసిన మరో ఓవర్లో శాంటర్న్ పెవిలియన్ చేరాడు. దాంతో 20 పరుగుల వ్యవధిలో కివీస్ మూడు వికెట్లను చేజార్చుకుంది. ఒకవైపు వికెట్లు పడుతుండటంతో స్కోరును పెంచే బాధ్యత రాస్ టేలర్పై పడింది. దీంతో సెంచరీకి చేరువగా వచ్చిన రాస్ టేలర్ ఏడో వికెట్గా మహ్మద్ షమీ బౌలింగ్లో దినేశ్ కార్తీక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
మరో రెండు మ్యాచ్లు
ఈ సిరిస్లో మరో రెండు మ్యాచ్లు ఉన్నాయని, సిరిస్ చేజారినప్పటికీ పరువు నిలుపుకునేందుకు అవకాశం ఉందని రాస్ టేలర్ వ్యాఖ్యానించాడు. "హామిల్టన్ మాకు అచ్చొచ్చింది. మేం తిరిగి లయ అందుకుంటామని నమ్మకముంది. అన్ని విభాగాల్లోనూ మేం రాణించాల్సి ఉంది. కోహ్లీ అద్భుతమైన నాయకుడు. పాండ్యా భారత జట్టుకు సమతూకం తెస్తున్నాడు. కుల్దీప్, చాహల్ను ఎదుర్కోవాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే" అని అన్నాడు.
చివరి రెండు వన్డేలకు రెండు మార్పులు
ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న న్యూజిలాండ్.. భారత్తో జరిగే చివరి రెండు వన్డేలకు రెండు మార్పులు చేసింది. ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్, లెగ్ స్పిన్నర్ టాడ్ ఆస్లీలకు సెలక్టర్లు చోటు కల్పించారు. బ్రాస్వెల్, ఇష్ సోధీ స్థానాల్లో వీళ్లకు చోటు కల్పించింది. మోకాలి గాయంతో గతేడాది నవంబర్లో పాక్తో సిరీస్కు దూరమైన ఆస్లీ పూర్తి ఫిట్నెస్తో ఉన్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.