ప్రతికూలత పరిస్థితుల్లోనూ బంగ్లాదేశ్తో రెండో టెస్టు గెలిచిన జోరు, న్యూజిలాండ్పై మెరుగైన రికార్డులతో.. మూడు టెస్టుల సిరీస్ను ఘనంగా ఆరంభించాలని భారత్ ఉత్సాహంతో బరిలోకి దిగింది. కానీ బెంగళూరు టెస్టులో ఊహించని పరాభవం. కివీస్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయం, సిరీస్లో 1-0తో వెనుకంజలో పడింది. అంతేగాక సొంతగడ్డపై రోహిత్సేన 46 పరుగులకే కుప్పకూలింది.
అయితే టెస్టు సిరీస్ను నిలుపుకోవాలంటే గురువారం నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టులో భారత్ తప్పక సత్తాచాటాలి. కివీస్ను చిత్తు చేసి సిరీస్పై గురిపెట్టాలి. అంతేగాక వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు రేసులో నిలవడానికి పుణె టెస్టు టీమిండియాకు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగాలకు బదులుగా మన బలమైన స్పిన్ వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలో పుణె టెస్టులో సంప్రదాయ స్పిన్ వికెట్పై న్యూజిలాండ్తో భారత్ ఢీకొననుందని సమాచారం. వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటన ఉండటంతో.. దానికి సన్నద్ధమవ్వడానికి అనుగుణంగా బంగ్లాదేశ్తో రెండు టెస్టులకు, న్యూజిలాండ్తో తొలి టెస్టుకు పేస్ పిచ్లను సిద్ధం చేశారు. బలహీనమైన బంగ్లాపై పైచేయి సాధించినప్పటికీ కివీస్తో మ్యాచ్లో పేస్ వ్యూహం బెడిసికొట్టింది. దీంతో ప్రత్యర్థికి స్పిన్ ఉచ్చును బిగించాలని టీమిండియా భావిస్తోంది.

ఈ నేపథ్యంలో రెండో టెస్టులో పేస్కు సహకరించేలా పిచ్ క్యురేటర్కు టీమిండియా ప్రత్యేకమైన ఆదేశాలేమీ ఇవ్వలేదు. అయితే పుణె వికెట్ మరీ బంతి గింగిరాలు తిరిగే స్థాయిలో ఉండదని తెలుస్తోంది. స్లో టర్నింగ్ పిచ్గా ఉండనుంది. మొదటి రెండు రోజులు తొలి సెషన్లో పేసర్లు ప్రభావం చూపిస్తారు. ఆ తర్వాత క్రమంగా స్పిన్నర్లకు పిచ్ సహకరిస్తుంది. ఈ పరిస్థితులు బ్యాటింగ్కు కూడా అనుకూలంగా ఉంటాయి. దీంతో భారత్ ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది.