ఆక్లాండ్: టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ కీలక వికెట్లు చేజార్చుకుంది. మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లు చెలరేగడంతో ఇప్పటికే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పేసర్ శార్దూల్ ఠాకూర్, స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ తలో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ను దెబ్బకొట్టారు. మరోవైపు రనౌట్ల రూపంలో మార్టిన్ గప్తిల్, జిమ్మీ నీషమ్లను భారత ఫీల్డర్లు పెవిలియన్ చేర్చారు.
నికోలస్ ఔట్.. గుప్టిల్ హాఫ్ సెంచరీ.. కివీస్ స్కోర్ 133/1
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, హెర్నీ నికోలస్ మంచి శుభారంభం అందించారు. భారత బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ తొలి వికెట్కి 93 పరుగులు జోడించారు. అయితే చాహల్ వేసిన 17వ ఓవర్ ఐదో బంతికి హెర్నీ నికోలస్ (41) ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఇక ఆ తర్వాతి ఓవర్లో గప్తిల్ అర్ధ సెంచరీ చేసాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 51 పరుగులు చేశాడు.
హాఫ్ సెంచరీ అనంతరం గప్తిల్ బౌండరీలతో రెచ్చిపోయాడు. మరోవైపు టామ్ బ్లండెల్ అతనికి చక్కటి సహకారం అందించాడు. ఠాకూర్ వేసిన 27వ ఓవర్ రెండో బంతిని ఫోర్ బాదిన బ్లండెల్ (22)..ఆ తర్వాతి బాల్ను కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మిడాన్లో నవదీప్ సైని చేతికి చిక్కాడు. ఇక రవీంద్ర జడేజా వేసిన 30వ ఓవర్లో మార్టిన్ గప్తిల్ (79; 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లు) రనౌటయ్యాడు. రనౌట్ అని కచ్చితంగా గప్టిల్కు తెలియడంతో.. థర్డ్ అంపైర్ నిర్ణయం కోసం వేచి ఉండకుండానే మైదానాన్ని వీడాడు.
ఈ సమయంలో ఠాకూర్, చాహల్ రెచ్చిపోవడంతో కివీస్ వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయింది. జడేజా కూడా ఓ అద్భుత త్రోతో నీషమ్ను పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ టామ్ లాథమ్ (7), జిమ్మీ నీషమ్ (3), కొలిన్ డి గ్రాండ్హోమ్ (5), మార్క్ చాప్మన్ (1)లు వరుసగా పెవిలియన్ చేరారు. ఒకేసారి కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి తోడు పేసర్ టిమ్ సౌథీ ఉన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ 41 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజ్లో టేలర్ (29), సౌథీ (3) ఉన్నారు.