గప్తిల్ అర్ధ సెంచరీ:
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, హెర్నీ నికోలస్ మంచి శుభారంభం అందించారు. భారత బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ తొలి వికెట్కి 93 పరుగులు జోడించారు. అయితే చాహల్ వేసిన 17వ ఓవర్ ఐదో బంతికి హెర్నీ నికోలస్ (41) ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఇక ఆ తర్వాతి ఓవర్లో గప్తిల్ అర్ధ సెంచరీ చేసాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 51 పరుగులు చేశాడు.
జడేజా మాయ:
హాఫ్ సెంచరీ అనంతరం గప్తిల్ బౌండరీలతో రెచ్చిపోయాడు. మరోవైపు టామ్ బ్లండెల్ అతనికి చక్కటి సహకారం అందించాడు. ఠాకూర్ వేసిన 27వ ఓవర్ రెండో బంతిని ఫోర్ బాదిన బ్లండెల్ (22).. ఆ తర్వాతి బాల్ను కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మిడాన్లో నవదీప్ సైని చేతికి చిక్కాడు. ఇక రవీంద్ర జడేజా వేసిన 30వ ఓవర్లో మార్టిన్ గప్తిల్ (79; 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లు) రనౌటయ్యాడు. జడేజా అద్భుత త్రోకు గప్టిల్ బలయ్యాడు.
రెచ్చిపోయిన ఠాకూర్, చాహల్:
ఇదే సమయంలో ఠాకూర్, చాహల్ రెచ్చిపోవడంతో కివీస్ వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయింది. జడేజా కూడా ఓ అద్భుత త్రోతో నీషమ్ను పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ టామ్ లాథమ్ (7), జిమ్మీ నీషమ్ (3), కొలిన్ డి గ్రాండ్హోమ్ (5), మార్క్ చాప్మన్ (1)లు వరుసగా పెవిలియన్ చేరారు. ఒకేసారి కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ ఆదుకున్నాడు.
రాణించిన జేమీసన్:
భారత బౌలర్లు అద్భుత బంతులు వేసినా టేలర్ పట్టువదలకుండా బ్యాటింగ్ చేశాడు. 74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 73 పరుగులు చేశాడు. ఈ రోజే అంతర్జాతీయ వన్డేల్లో ఆరంగేట్ర చేసిన కైల్ జేమీసన్ కూడా ఈ మ్యాచ్లో రాణించాడు. 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 25 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 273 పరుగులు చేసింది.