బంగ్లాదేశ్ను టెస్టు, టీ20 ఫార్మాట్లో క్లీన్స్వీప్ చేసిన భారత్.. స్వదేశంలో మరో టెస్టు సిరీస్కు సిద్ధమైంది. ఇవాళ నుంచి న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలగిస్తున్నాడు. చిన్నస్వామి స్టేడియం వద్ద వర్షం కురవడంతో టాస్ ఆలస్యం కానుంది.
వాస్తవానికి టాస్ ఉదయం 9 గంటలకు పడాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా ఆలస్యం అవుతుందని మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. అయితే మైదానానికి ఇంకా ఇరు జట్లు రాలేదని తెలుస్తోంది. టీమిండియా మేనేజ్మెంట్తో అంపైర్లు మాట్లాడుతున్నారు. కాగా, పిచ్పై, మైదానంలో కవర్లు కప్పి ఉంచారు. వర్షం తగ్గుముఖం పడితే మ్యాచ్ను నిర్వహించడం సాధ్యమే. చిన్నస్వామి స్టేడియంలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉంది.

అయితే తొలి టెస్టు సజావుగా సాగడం అనుమానమే అనిపిస్తోంది. వారం రోజుల పాటు వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆటలో తొలి రోజు, రెండో రోజు 70 %, 90 % వరుసగా వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజులు వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పటికే బెంగళూరుతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
కాగా, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించడానికి అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం కానుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో భారత్ అగ్రస్థానంలో ఉంది.మరోవైపు శ్రీలంక పర్యటనలో ఘోరపరాజయం చవిచూసిన న్యూజిలాండ్ ఈ సిరీస్ను అయినా దక్కించుకోవాలని పట్టుదలతో సన్నద్ధమవుతోంది.
A wet start to Day 1 in Bengaluru. Heavy rain around M Chinnaswamy Stadium means the toss will be delayed until further notice 🏏 #INDvNZ pic.twitter.com/eowepdeila
— BLACKCAPS (@BLACKCAPS) October 16, 2024
భారత గడ్డపై ఇప్పటివరకు న్యూజిలాండ్ ఒక్కసారి కూడా వన్డే, టెస్టు సిరీస్ గెలవలేదు. మొత్తంగా ఇప్పటివరకు ఇరు జట్లు 62 టెస్టుల్లో తలపడగా భారత్ 22, న్యూజిలాండ్ 13 గెలిచాయి. 27 టెస్టులు డ్రాగా ముగిశాయి. ఇక స్వదేశంలో న్యూజిలాండ్తో టీమిండియా 12 టెస్టు సిరీస్ ఆడింది. 10 సిరీస్లు గెలవగా, రెండు డ్రా అయ్యాయి.