మూడు టెస్టుల సిరీస్లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. పది ఓవరల్లోపే భారత్ కీలక మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (2; 16 బంతుల్లో), విరాట్ కోహ్లి (డకౌట్; 9 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (డకౌట్; 3 బంతుల్లో) వరుసగా పెవిలియన్కు చేరారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు శుభారంభం దక్కలేదు. పేస్కు అనుకూలిస్తున్న పిచ్పై న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు చెలరేగిపోయారు. టిమ్ సౌథి, మ్యాట్ హెన్రీ కొత్త బంతితో ఓపెనర్లు జైస్వాల్, రోహిత్ను తీవ్రంగా పరీక్షించారు. అయితే ఆరు ఓవర్ల పాటు ఓపికగా ఆడిన రోహిత్ తర్వాత ఎదురుదాడికి దిగాలని భావించాడు. కానీ రోహిత్ను సౌథి క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ డకౌటయ్యారు. ఒరుర్కె వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన కోహ్లి గ్లెన్ ఫిలిప్స్ చేతికి చిక్కాడు. కాస్త ఎక్స్ట్రా బౌన్స్ అయిన బంతిని డిఫెండ్కు ప్రయత్నించి లెగ్ గల్లీలో ఉన్న ఫిలిప్స్కు దొరికిపోయాడు. మరోవైపు మ్యాట్ హెన్రీ బౌలింగ్లో సర్ఫరాజ్ ఔటయ్యాడు. షాట్కు యత్నించిన సర్ఫరాజ్ ఎక్సట్రా కవర్లో ఉన్న కాన్వేకు చిక్కాడు. కాన్వే అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ను అందుకున్నాడు.
ప్రస్తుతం భారత్ 12 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైస్వాల్ (8; 37 బంతుల్లో), రిషభ్ పంత్ (3; 8 బంతుల్లో) ఉన్నారు. సౌథి, హెన్రీ, ఒరుర్కె తలో వికెట్ తీశారు.