బెంగళూరు వేదికగా జరగాల్సిన భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం కారణంగా మొదటి రోజు తొలి సెషన్ పూర్తిగా రద్దయింది. వర్షం ధాటికి కనీసం టాస్ కూడా పడలేదు. న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇవాళ నుంచి భారత్ మొదటి టెస్టు ఆడాల్సి ఉంది.
అయితే మధ్యాహ్నం ధాటికి వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వరుణుడు కాస్త కరుణించినా ఇవాళ కొన్ని ఓవర్ల పాటు ఆట జరిగే ఛాన్స్ ఉంటుంది. మ్యాచ్ వేదిక అయిన చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజి వ్యవస్థ ఉంది. వర్షం ఆగితే సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం పట్టదు.

కాగా, బుధవారం ఆట మాత్రమే తొలి టెస్టు సజావుగా సాగడం అనుమానమే అనిపిస్తోంది. వారం రోజుల పాటు వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే బెంగళూరుతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం.
జట్టు వివరాలు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్).
న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, మైకేల్ బ్రేస్వెల్ (తొలి టెస్టుకు మాత్రమే), మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఒరుర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సీర్స్, ఇష్ సోథి (2,3 టెస్టులకు), టిమ్ సౌథి, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.