
జైపూర్: టీమిండియా కోచ్గా భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఇటీవల నియమితులైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2021తో రవిశాస్త్రి కోచింగ్ బాధ్యతలు పూర్తవ్వడంతో.. అతని స్థానంలో ద్రవిడ్ వచ్చారు. మూడు టీ20 సిరీసులో భాగంగా న్యూజిలాండ్తో బుధవారం జరగనున్న తొలి టీ20 కోసం జైపూర్లో సోమవారం రోహిత్ సేన ప్రాక్టీస్ చేసింది. అయితే కోచ్గా బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్.. భారత ఆటగాళ్లకు తనదైన శైలిలో శిక్షణ ఇచ్చాడు. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా టీమిండియా ప్లేయర్లకు ద్రవిడ్ కొన్ని సూచనలు చేశాడు. భారత కోచ్గా నియమితులయ్యాక 'ది వాల్'కు ఇదే తొలి రోజు.
టీ20 ప్రపంచకప్ 2021 కోసం యూఏఈ వెళ్లిన భారత ఆటగాళ్లు తాజాగా భారత్ చేరుకుని జైపూర్లో ఏకమయ్యారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో బుధవారం తొలిసారి ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా బ్యాటింగ్ దిగ్గజం నూతన టీ20 కెప్టెన్ రోహిత్ శర్మకు బాల్స్ వేస్తూ కనిపించారు. సవాయి మాన్సింగ్ స్టేడియంలో జరిగిన శిక్షణలో బ్యాటర్లకు రాహుల్ కొన్ని బాల్స్ త్రో చేశారు. ఆ వీడియోను బీసీసీఐ ఇన్స్టాగ్రామ్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది. 'కొత్త బాధ్యతలు, కొత్త సవాళ్లు, కొత్త ప్రారంభం' అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీమిండియా ఆఫీసులో ద్రవిడ్ రాకతో కొత్త జోష్ నిండినట్లు బీసీసీఐ తెలిపింది.
ఇప్పటికే అనేక మంది యువ ఆటగాళ్లు అండర్-19 స్థాయిలో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోనే మేటి ఆటగాళ్లుగా తయారైన సంగతి తెలిసిందే. కొందరు ప్లేయర్స్ ఇప్పుడు భారత జట్టులోనూ ఆడన్నారు. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగుస్తున్న నేపథ్యంలో చాలా మంది ద్రవిడ్నే తర్వాతి కోచ్గా నియమించాలంటూ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా అతడిని ఒప్పించారని సమాచారం. మరోవైపు ద్రవిడ్ ఇటీవల శ్రీలంక పర్యటనలోనూ భారత జట్టు కోచ్గా సేవలందించిన సంగతి తెలిసిందే. గతంలో ఇండియా-ఏ జట్టుకు, శ్రీలంకలో పర్యటించిన టీమిండియాకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరించాడు.
ఇక టీ20 ప్రపంచకప్ 2021లో రెండు అర్ధ శతకాలతో మెరిసిన రోహిత్ శర్మ నెట్స్లో బాగా బ్యాటింగ్ చేశాడు. సరైన టైమింగ్తో షాట్లు ఆడుతూ కనిపించాడు. మరోవైపు జైపూర్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలమనే వార్తలు వినిపిస్తుండటంతో హిట్మ్యాన్ రాబోయే సిరీస్లో ఎలా చెలరేగుతాడో చూడాలి. మిగతా వారందరూ కూడా నెట్స్లో శ్రమించారు. విరాట్ కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకోవడంతో.. జట్టు పగ్గాలను బీసీసీఐ రోహిత్ శర్మకు అందించింది. ఈ టీ20ల కోసం మొత్తం 16 సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించింది. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా న్యూజిలాండ్ సిరీస్కు వ్యవహరించనున్నారు. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్తో భారత్.. మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీలకు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చహల్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్.