
హైదరాబాద్: మూడు టీ20ల సిరీస్లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా బుధవారం ప్రారంభమైన తొలి టీ20లో న్యూజిలాండ్ ఓపెనర్లు చెలరేగారు. దీంతో 10 ఓవర్లకు గాను ఒక వికెట్ నష్టానికి ఆతిథ్య జట్టు 97 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్ జట్టుని బ్యాటింగ్ను ఆహ్వానించాడు.
దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఓపెనర్లు కోలిన్ మున్రో, టిమ్ షైఫెర్ట్ ఆ జట్టుకు చక్కటి ఆరంభాన్ని అందించారు. బ్యాటింగ్ పవర్ప్లేలో భారత బౌలర్లకు చుక్కలు చూపించిడంతో పాటు భారీ స్కోర్ సాధించారు. మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. దీంతో ఆరు ఓవర్లలో 66 పరుగులు చేశారు.
ఆ తర్వాత మరో ఓపెనర్ షైఫెర్ట్ చెలరేగడంతో 30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సమయంలో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా వేసిన 9వ ఓవర్ రెండో బంతికి మున్రో(34) భారీ షాట్కు ప్రయత్నించి.. విజయ్ శంకర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది.
ఇప్పటికే ముగిసిన ఐదు వన్డేల సిరీస్ని 4-1తో చేజిక్కించుకున్న భారత్ జట్టు అదే జోరుని టీ20ల్లోనూ కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు సొంతగడ్డపై వన్డే సిరీస్ని చేజార్చుకున్నా.. కనీసం టీ20 సిరీస్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ ఆశిస్తోంది. విజయ్ శంకర్, రిషభ్ పంత్, ఖలీల్ అహ్మద్ జట్టులోకి వచ్చారు.
దీంతో ధోని, కార్తీక్తో కలిపి టీమ్లో ముగ్గురు వికెట్ కీపర్లకి చోటు లభించింది. ఈ మ్యాచ్లో పాండ్యా సోదరులు కలిసి ఆడుతుండటం విశేషం. దీంతో మోహిందర్ అమరనాథ్, సురీందర్ అమరనాథ్.. ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున మైదానంలో మెరిశారు. మళ్లీ ఇన్నాళ్లకి హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా రూపంలో 'సోదరులు' ఆడుతున్నారు.
అయితే గత ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే భారత్పై కివీస్దే పైచేయిగా ఉంది. న్యూజిలాండ్ గడ్డపై భారత జట్టు ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ను కూడా గెలవలేదు. 2008-09 పర్యటనలో ధోని సారథ్యంలో టీ20 సిరీస్ ఆడిన టీమిండియా 0-2తో ఓడిపోయింది.