
చెలరేగిన రాహుల్:
204 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (7) త్వరగానే పెవిలియన్ చేరాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో రాస్ టేలర్ చేతికి చిక్కాడు. ఆపై లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. కోహ్లీ అండతో రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా బౌండరీలు, సిక్సులు బాదుతూ వేగంగా పరుగులు చేసాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు.

కోహ్లీ కమాల్:
లక్ష్యం పెద్దది కావడంతో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రాహుల్ క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. కోహ్లీతో కలిసి రాహుల్ 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మరోవైపు కోహ్లీ కూడా తన మార్క్ ఆటతో అలరించాడు. పేస్, స్పిన్ బౌలింగ్లలో వేగంగా పరుగులు చేసాడు. కొద్దిసేపటికే కోహ్లీ (49) కూడా క్యాచ్ ఔట్ రూపంలో నిష్క్రమించాడు. దీంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.

అయ్యర్ వీరవిహారం:
శ్రేయాస్ అయ్యర్కు జత కలిసిన శివమ్ దూబే (13) ఓ సిక్స్, ఫోర్ కొట్టి కొద్దిగా ఒత్తిడి తగ్గించాడు. అయితే భారీ షాట్ ఆడి ఔట్ అయ్యాడు. ఈ సమయంలో అయ్యర్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడి వీరవిహారం చేసాడు. బౌండరీలు, సిక్సులు బాదుతూ కొండంత లక్ష్యాన్ని కరిగించాడు. మనీష్ పాండే (14)తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఐదు టీ20ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఆక్లాండ్ వేదికనే రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. అద్భుత ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించిన శ్రేయాస్ అయ్యర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

మున్రో మాయ:
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. మార్టిన్ గప్టిల్ 30 పరుగులు చేయగా.. కోలిన్ మున్రో (59), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51), రాస్ టేలర్ (54) అర్ధ సెంచరీలతో విరుచుకుపడ్డారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, శివం దూబే, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications
