
ఇద్దరు ఓపెనర్ల అరంగేట్రం:
న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్లో భారత బ్యాటింగ్ ఆర్డర్లో భారీ మార్పులు ఉండనున్నాయి. గాయాలతో సీనియర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు దూరమయ్యారు. దీంతో భారత్ తరఫున ఇద్దరు ఓపెనర్లు అరంగేట్రం చేయనున్నారు. టెస్టుల్లో నిరూపించుకున్న మయాంక్ అగర్వాల్, యువ ఆటగాడు పృథ్వీ షా ఓపెనర్లుగా రానున్నారు. భారత్ తరఫున ఓపెనర్లు ఒకేసారి అరంగేట్రం చేయడం ఇది నాలుగోసారి. 2016లో కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, 1974లో సునిల్ గావస్కర్, సుధీర్ నాయక్, 1976లో పార్థసారథి శర్మ, దిలీప్ వెంగ్సర్కార్ ఓపెనింగ్ చేశారు.

రాహులే కీపర్:
కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, లోకేష్ రాహుల్ వరుసగా 3, 4, 5వ స్థానంలో రావడం ఖాయం. టీ20 సిరీస్లో వికెట్ కీపింగ్తో అద్భుతంగా రాణించడంతో.. మరోసారి రాహులే ఆ బాధ్యతలు మోయనున్నాడు. ఇక ఆరో స్థానంలో మనీష్ పాండేకు చోటు దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే పాండేకు కేదార్ జాదవ్ నుండి పోటీ ఉంది. మరి కెప్టెన్ ఎవరికి ఓటేస్తాడో చూడాలి.

సైనీకే ఛాన్స్:
ఆల్రౌండర్ కోటాలో శివమ్ దూబే, రవీంద్ర జడేజాలు పోటీలో ఉన్నా.. జడ్డూకే అవకాశం దక్కనుంది. టీ20 సిరీస్లో దూబే విఫలం కాగా.. జడ్డూ ఆకట్టుకున్నాడు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల సూత్రాన్ని అనుసరిస్తే కుల్దీప్ యాదవ్ జట్టులో ఉండొచ్చు. పేస్ విబాగంలో మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా ఖాయమే. నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్లలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. సైనీపైనే కోహ్లీ మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి.

టేలర్పైనే బ్యాటింగ్ భారం:
ఆసీస్తో టెస్టు సిరీస్, భారత్తో టీ20 సిరీస్ క్లీన్స్వీప్ అయిన కివీస్ విజయాల కోసం తహతహలాడుతోంది. గాయంతో రెండు వన్డేలకు కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమవ్వడం ఎదురుదెబ్బే. సీనియర్ రాస్ టేలర్పైనే బ్యాటింగ్ భారం ఉంది. టామ్ లాథమ్ సారధ్య బాధ్యతలు తీసుకోనున్నాడు. ఆల్రౌండర్లు జిమ్మీ నీషమ్, కొలిన్ డి గ్రాండ్హోమ్ జట్టులో చేరారు. కీపర్ టామ్ బ్లండెల్, పేసర్ కైల్ జేమిసన్ వన్డేల్లో అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నారు.

భారత జట్టు (అంచనా):
భారత్: పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/యుజువేంద్ర చాహల్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ.


Click it and Unblock the Notifications












