
భారత క్రికెట్ జట్టు జూన్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐర్లాండ్తో టీమిండియా 2 టీ20 మ్యాచ్లు ఆడనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఐర్లాండ్ క్రికెట్ బోర్డు తాజాగా విడుదల చేసింది. ఈ పర్యటనలో భారత సీనియర్ ఆటగాళ్లు ఆడే అవకాశం లేదు. టీమిండియా బీ జట్టు ఐర్లాండ్లో పర్యటించే అవకాశం ఉంది. దీనిని బట్టి కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు ఈ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. కాగా ఈ మ్యాచ్లు మలాహిడ్లో జరగనున్నాయి. దీంతో నాలుగేళ్ల తర్వాత టీమిండియా ఐర్లాండ్లో పర్యటించనుంది. చివరగా భారత జట్టు 2018లో ఐర్లాండ్లో పర్యటించింది.
ఈ సిరీస్కు కంటే ముందే స్వదేశంలో టీమిండియా 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ జూన్ 9 నుంచి 17 మధ్య జరగనుంది. ఐపీఎల్ 2022 తర్వాత భారత ఆటగాళ్లు నేరుగా ఈ సిరీస్లో ఆడునున్నారు. ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటన ముగించుకుని టీమిండియా ఇంగ్లండ్ వెళ్లనుంది. అక్కడ గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన టెస్ట్ సిరీస్లోని ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. కాగా గతేడాది ఇంగ్లండ్ గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్లో ఐదో టెస్ట్కు ముందు భారత శిబిరంలో కరోనా కేసులు బయటపడడంతో ఆ మ్యాచ్ వాయిదా పడింది. కాగా ప్రస్తుతానికి టెస్ట్ సిరీస్లో టీమిండియా 2-1 తేడాతో అధిక్యంలో ఉంది. ఇక జూలై ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడిన అనంతరం ఇంగ్లండ్తో టీమిండియా 3 వన్డే మ్యాచ్లు, 3 టీ20 మ్యాచ్లు కూడా ఆడనుంది.
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచప్నకు అర్హత సాధించిన ఐర్లాండ్ జట్టు వరుసగా టీ20 సిరీస్లు ఆడనుంది. ప్రపంచకప్నకు ముందు భారత్తోపాటు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వే జట్లు ఐర్లాండ్ టీ20 సిరీస్లు ఆడనుంది. కాగా భారత జట్టు మాత్రం ఈ నెల 4 నుంచి శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లంతా ఐపీఎల్లో పాల్గొననున్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది.