హైదరాబాద్: కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా రెండు టీ20 సిరిస్ కోసం ఐర్లాండ్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. డబ్లిన్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 76 పరుగల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు టీ20ల సిరిస్లో కోహ్లీసేన 1-0 ఆధిక్యంలో నిలిచింది.
అదే సమయంలో రెండో టీ20కి ముందు దొరికిన ఒక రోజు గ్యాప్లో భారత జట్టులోని ఆటగాళ్లు కొందరు సైట్ సీయింగ్కు వెళ్లారు. డబ్లిన్ సిటీ అందాలను చూశారు. కెప్టెన్ కోహ్లీతోపాటు ఓపెనర్ శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా సరదాగా బయటకు వెళ్లారు.
ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ "డబ్లిన్లో అందమైన రోజు" అంటూ పాండ్యా, రాహుల్, ధావన్తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Beautiful day in Sunny Dublin. 👌 pic.twitter.com/fAGkBtLfcm
— Virat Kohli (@imVkohli) June 28, 2018
తొలి టీ20 జరిగిన గ్రౌండ్లోనే శుక్రవారం ఐర్లాండ్తో మరో టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్లో జోరు కొనసాగించి సిరీస్ గెలవాలన్న ఉత్సాహంతో ఉంది. ఓపెనర్లు రోహిత్శర్మ, శిఖర్ ధావన్ జోరు మీదుండడంతో భారత్కు కలిసొచ్చే అంశం. అయితే ఈ మ్యాచ్ను ప్రయోగాలకు వాడుకోవాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది.
ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బ్యాట్స్మెన్ అందరికీ చాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కోహ్లీ ఉన్నాడు. దీంతో ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్కీపర్ దినేశ్ కార్తీక్, ఉమేశ్ యాదవ్లను రెండో టీ20 మ్యాచ్లో బరిలో దించే అవకాశాలు లేకపోలేదు. రోహిత్, ధావన్లను కొనసాగించి రాహుల్ను మిడిలార్డర్లో పంపే అవకాశాలున్నాయి.
Just chillin' with the guys after a wonderful start to the tour. pic.twitter.com/vbZfCzbHRd
— Shikhar Dhawan (@SDhawan25) June 28, 2018