టీ20 వరల్డ్ కప్-2024లో భారత్ తమ తొలి సమరానికి సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో నాసా కంట్రీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఐర్లాండ్తో తలపడనుంది. స్థానికంగా ఉదయం 10.30 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఐపీఎల్లో దాదాపు రెండు నెలలు పాటు ప్రత్యర్థులుగా తలపడిన భారత ఆటగాళ్లు తిరిగి ప్రపంచకప్ కోసం జతకట్టారు.
ఐర్లాండ్పై ఘన విజయం సాధించి పొట్టి కప్ను గ్రాండ్గా ఆరంభించాలని భారత్ భావిస్తోంది. గ్రూప్-ఏలో భాగంగా జరుగుతున్న ఈ పోరులో టీమిండియా ఫేవరేట్ అయినప్పటికీ ఐర్లాండ్ను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. గత టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్కు ఐర్లాండ్ షాక్ ఇచ్చింది. అంతేగాక ఇటీవల పాకిస్థాన్ను సిరీస్లో మట్టికరిపించింది. అగ్ర జట్లకు షాక్లు ఇవ్వడం ఐర్లాండ్ ఎప్పుడూ ముందుటుంది. ఈ జట్టులో ఆల్రౌండర్లు ఎక్కువగా ఉన్నారు.

అయితే ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య హోరాహోరీ మ్యాచ్ చూడాలనకున్న అభిమానులకు ఓ చేదువార్త. న్యూయార్క్లోని డ్రాప్ ఇన్ పిచ్ అసాధారణంగా ప్రవర్తిస్తోంది. ఈ వేదికగా జరిగిన గత మ్యాచ్లో స్వల్ప స్కోరులు నమోదయ్యాయి. శ్రీలంక 77 పరుగులే ఔటవ్వగా, దాన్ని ఛేదించడానికి సౌతాఫ్రికా 16 ఓవర్లు వరకు పట్టింది. బంతి పిచ్ను తాకిన తర్వాత అసాధారణంగా బౌన్స్ అవుతుంది. అంతేగాక అవుట్ ఫీల్డ్ చాలా నెమ్మదిగా ఉంది.
ఇక్కడ ఫీల్డింగ్ చేసే సమయంలో గాయపడకుండా ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా సూచించడం గమనార్హం. ఇవాళ మ్యాచ్లో భారీ స్కోర్లు ఆశించవద్దని కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అభిమానులకు ముందే చెప్పేశాడు. ఐపీఎల్ తరహాలో పరుగుల వరద ఆశించొద్దని హిట్ మ్యాన్ అన్నాడు. ధనాధన్ క్రికెట్ను కోరుకునే అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. న్యూయార్క్తో పాటు వెస్టిండీస్లోని పిచ్లు కూడా స్లోగా ఉన్నాయి. మరి, ఈ స్లో థ్రిల్లింగ్ మ్యాచ్లు అభిమానులకు వినోదాన్ని అందిస్తాయో లేదా చూడాలి!