వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ శతకం సాధించాడు. సహచరులు వెనుదిరుగుతున్నా పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. 151 బంతుల్లో సెంచరీని సాధించాడు. 13 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. సెంచరీ మార్క్ను జైశ్వాల్ సిక్సర్తో అందుకోవడం విశేషం. 94 పరుగుల వద్ద టామ్ హర్ట్లీ వేసిన బంతిని క్రీజు బయటికి వచ్చి స్టాండ్స్కు తరలించాడు.
ఇప్పటివరకు యశస్వీజైశ్వాల్ ఆరు టెస్టులు ఆడగా రెండు సెంచరీలు సాధించాడు. 2023-25 వరల్ట్ టెస్టు ఛాంపియన్ షిప్లో రెండు సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. 41 బంతులు ఎదుర్కొని 14 పరుగులు చేసి ఔటయ్యాడు.అరంగేట్ర బౌలర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో రోహిత్ లెగ్ స్లిప్లో ఒలీ పోప్ చేతికి చిక్కాడు.

ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన శుభ్మన్ గిల్తో కలిసి జైశ్వాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. మరోవైపు గిల్ కూడా సాధికారికంగానే బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో అయిదు బౌండరీలతో 34 పరుగులు చేశాడు. కానీ కుదురుకున్న గిల్ను అండర్సన్ బోల్తాకొట్టించాడు. దీంతో వీరిద్దరి 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం శ్రేయస్ అయ్యర్ (27; 59 బంతుల్లో)తో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.ఈ క్రమంలోనే సెంచరీని చేశాడు. శ్రేయస్, జైశ్వాల్ మూడో వికెట్కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అయితే సెహ్వాగ్ స్టైల్లో సిక్సర్తో సెంచరీ సాధించిన జైశ్వాల్కు నెట్టింట్లో ప్రశంసలు దక్కుతున్నాయి. కాగా, ప్రస్తుతం జైశ్వాల్, రజత్ పటిదార్ క్రీజులో ఉన్నారు. 56 ఓవర్లకు భారత్ మూడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.