
నాటింగ్హమ్: ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల జట్ల మధ్య ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా చాలా రోజుల తర్వాత ప్రేక్షకులు మైదానంలో సందడి చేశారు. తమ అభిమాన ప్లేయర్ ఆటచూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే స్టేడియంలోని ప్రేక్షకులు చెవులకు ఎర్రటి పరికరాలను ధరించి కనిపించారు. ముఖ్యంగా ఇంగ్లండ్ ఫాన్స్ ఈ ఎర్రటి పరికరాలను చెవిలో పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ సందడి చేశారు. ఇంతకి వారు పెట్టుకున్నవి ఏంటి, వాటి వల్ల ఉపయోగం ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు. అవి మరేంటో కాదు సౌండ్ మెషిన్లు.
స్టేడియంలో కూర్చొని మ్యాచ్లు చూసే వారికి ఆన్ ఫీల్డ్లో ఏం జరుగుతుందో సరిగ్గా అర్దం కాదు. ఒక్కోసారి ప్రేక్షకులు అయోమయంకు గురవుతారు. ఫోర్లు, సిక్సులు కొట్టినప్పుడు కూడా ఏ బౌండరీ అని తెలియదు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రేక్షకులు తమ చెవులకు చిన్న రేడియోలను పెట్టుకుంటారు. లోకల్ రేడియో స్టేషన్లో క్రికెట్ కామెంట్రీని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వింటుంటారు. టీవీ ప్రసారాలు అందించే స్కై స్పోర్ట్స్ నెట్వర్కే ఈ రేడియో ప్రసారాలనూ అందిస్తుంది. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులకు పిచ్ మధ్యలో ఏం జరుగుతుందో కామెంట్రీ రూపంలో వింటారు.
అయితే కామెంట్రీ కోసం ఫోన్లో రేడియో ఆన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని మీకు ఓ డౌట్ రావచ్చు. అందుకోసం రేడియో ప్రసారాలను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా స్కై స్పోర్ట్స్ అందించే ఈ స్పెషల్ గాడ్జెట్స్ ద్వారా మాత్రమే లైవ్ కామెంట్రీ వినే అవకాశం ఉంటుంది. అందుకే ప్రేక్షకులు అలా చెవులకు రేడియోలు పెట్టుకొని కనపడ్డారు. దాంతో ఆన్ ఫీల్డ్లో అసలు ఏం జరుగుతుందో వారికీ ఇట్టే అర్ధమయిపోతోంది. దాంతో ప్రేక్షకులు ఎలాంటి అయోమయంకు గురికారు. ముఖ్యంగా రివ్యూ సమయంలో సరైన స్పష్టత వస్తుంది.
తొలి టెస్ట్ మ్యాచ్ గెలిచి ముందంజ వేద్దామనుకున్న భారత ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. చివరి రోజు (ఆదివారం) ఎడతెరిపి లేని వర్షంతో మైదానం మొత్తం తడిసి ముద్దయ్యింది. ఆటకు అనువుగా లేకుండా చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఐదవ రోజు ఒక్క బంతి పడకుండానే ఆట డ్రాగా ముగియడంతో ఇరు జట్లకు చెరో నాలుగు పాయింట్లు కేటాయించారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యఛేదనలో ఆఖరి రోజు ఆదివారం ఆటకు వరుణుడు అడ్డంకిగా మారాడు.
దాదాపు ప్రతిసారి ఇంగ్లండ్లో తొలి టెస్టును కోల్పోతూ వస్తున్న భారత్.. ఈసారి చరిత్ర తిరుగరాద్దామనుకున్నా ఆశలు నెరవేరలేదు. ఈ సిరీస్ ద్వారా లోకేష్ రాహుల్ ఓపెనింగ్ బ్యాట్స్మన్గా నిలదొక్కుకోగా.. జస్ప్రీత్ బుమ్రా మళ్లీ పాత ఫామ్ పుణికిపుచ్చుకున్నాడు. రాహుల్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన బుమ్రా తన పేస్కు పదును తగ్గలేదని నిరూపించాడు. సెంచరీ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. ఇరు జట్లు మధ్య గురువారం నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు మొదలవనుంది.