|
పిచ్ను పరిశీలిస్తున్న ప్లేయర్స్:
ఇంగ్లండ్ ఆటగాళ్లు పిచ్ను పరిశీలిస్తున్న ఓ ఫొటోను టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుని వారిపై సెటైర్లు వేశాడు. జాఫర్ పంచుకున్న పోస్ట్లో ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, పేసర్ మార్క్ వుడ్, ఓపెనర్ జానీ బెయిర్స్టో, కెప్టెన్ జో రూట్, అసిస్టెంట్ కోచ్ పాల్ కాలింగ్వుడ్ ఉన్నారు. వీరందరూ మొతేరా పిచ్ను తదేకంగా పరిశీలిస్తున్నారు. అయితే వారి మధ్య సంభాషణ ఇలా ఉందని జాఫర్ సరదాగా వివరించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మా ఖేల్ కతం:
పిచ్ను చూసిన స్టువర్ట్ బ్రాడ్.. 'ఇక నా పర్యటన ముగిసింది' అని అంటాడు. ఆ పక్కనే ఉన్న మార్క్ వుడ్ స్పందిస్తూ.. 'కనీసం మీరు ఒక మ్యాచ్ అయినా ఆడారు బ్రో' అని పేర్కొన్నాడు. టెస్ట్ సిరీస్లో వుడ్ ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. పింక్ బాల్ టెస్ట్ రెండు ఇన్నింగ్స్లలో డకౌట్ అయిన జానీ బెయిర్స్టో ఫ్లాట్ పిచ్ కోసం ఆశతో ఎదురుచూస్తున్నాడని వసీం జాఫర్ పంచ్ వేశాడు. రూట్ పిచ్ వైపు చూస్తూ.. 'ఓ షిట్.. ఇక మా ఖేల్ కతం' అని అంటాడని జాఫర్ ట్రోల్ చేశాడు. 'ఓ మై గాడ్.. మళ్లీ టర్న్ అవుతుందా?' అని కాలింగ్వుడ్ అంటున్నాడని జాఫర్ సరదాగా పేర్కొన్నాడు.
112, 145 పరుగులకు ఆలౌట్:
డేనైట్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 112 పరుగులు చేయగా.. భారత్ 145 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 81 పరుగులకే ఆలౌటవ్వడంతో.. భారత్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ బౌలింగ్కు ఇంగ్లీష్ బ్యాట్స్మన్ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడ్డారు. అందుకే నాలుగో టెస్టులో స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు ఇంగ్లండ్ సన్నద్ధమవుతోంది.
పిచ్ను అంచనావేయలేకపోయాం:
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ముగ్గురు పేసర్లను తీసుకోవడానికి గల కారణాన్ని కెప్టెన్ జో రూట్ తాజాగా వివరించాడు. పింక్బాల్ టెస్టులో తాము పరిస్థితుల్ని తప్పుగా అంచనా వేశామని అంగీకరించాడు. నాలుగో టెస్టులో యువ స్పిన్నర్ డామ్ బెస్ను తుది జట్టులోకి తీసుకుంటామన్నాడు. 'పింక్బాల్ టెస్టులో మా జట్టు ఎంపికలో తప్పు జరిగింది. పిచ్ను అంచనావేయలేకపోయాం. గతంలో భారత్లో జరిగిన పింక్బాల్ టెస్టు పరిస్థితులను బట్టి, అక్కడ బంతి ఎలా స్పందించిందనే విషయాల పైనే ఈ మ్యాచ్లో తుది జట్టును ఎంపిక చేశాం. కానీ, బంతి ఇలా తిరుగుతుందని ఊహించలేదు' అని అన్నాడు.