సరిగ్గా ఆడకుండా..
'ఇటీవల భారత్లో జరిగిన టెస్టుల గురించి నన్ను కొందరు కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటిపై నాకు కొంత గందరగోళం ఏర్పడింది. అక్కడి పిచ్ల గురించి చాలా మాటలు వినబడుతున్నాయి. ఇకనైనా వీటిని ఆపండి. ఇంగ్లండ్ జట్టు వెళ్లిందే స్పిన్ పిచ్లు ఉండే దేశానికి. ఆ విధంగానే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా తయారు కావాల్సింది మీ బ్యాట్స్మెన్. మీరు సరిగ్గా ఆడకుండా వికెట్ను నిందించడం సరికాదు'అని వివియన్ రిచర్డ్స్ చురకలంటించాడు.
నేనున్నా.. స్పిన్ పిచ్లే..
ఇప్పుడు ఇంగ్లండ్ జట్టుకు స్పిన్ గురించి కొంత అవగాహన రావొచ్చని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. తర్వాతి మ్యాచ్లో రాణించేందుకు ఈ అనుభవం వారికి ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. తదుపరి టెస్టులోనూ ఇదే తరహా వికెట్ ఉంటుందని అంచనా వేశాడు. ఆ స్థానంలో నేనున్నా.. స్పిన్ పిచ్నే తయారు చేస్తానని వివియన్ స్పష్టం చేశాడు.
'ఇంగ్లండ్ ఆటగాళ్లు.. మొదటి టెస్టుకు ముందు ఉన్నంత సౌకర్యంగా రెండు, మూడు టెస్టుల తర్వాత లేరు. వారు స్పిన్ పిచ్లనే అభద్రత భావంలోకి వెళ్లారు. మేం ఆడుతున్నది స్పిన్ వికెట్ అనే విధంగా వారు మానసికంగా సిద్ధమవ్వాలి'అని విండీస్ క్రికెట్ దిగ్గజం సూచించాడు.
లయన్ కూడా..
మొతేరా పిచ్పై స్పందించిన నాథన్ లయన్ కూడా ఇంగ్లండ్ జట్టును తప్పుబట్టాడు. పిచ్ బాగుందని, ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ వైఫల్యమే కారణమని తెలిపాడు. అహ్మదాబాద్ పిచ్ క్యూరేటర్ను తాను సిడ్నీ క్రికెట్ గ్రౌండ్కు తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్లు కూడా చెప్పాడు. పూర్తిగా పేస్కు అనుకూలించే పిచ్లపై బ్యాట్స్మన్ అత్యల్ప స్కోర్కు ఔటైనా ఏ ఒక్కరు విమర్శించరని, అదే టర్నింగ్ ట్రాక్పై అలా జరిగితే మాత్రం ఏడుపు మొదలుపెడతారని అసహనం వ్యక్తం చేశాడు. 'టర్నింగ్ ట్రాక్ పై ఇంగ్లండ్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. ఇది చాలు. ఇక నేను చెప్పడానికి ఏమీ లేదు. ఈ వికెట్పై స్పిన్ బౌలింగ్ను చూడటానికి నేను రాత్రంగా మెలుకవగానే ఉన్నాను. పేస్ బౌలింగ్కు బ్యాట్స్మెన్ ఇబ్బంది పడినప్పుడు ఎవరూ మాట్లాడరు. పేస్ పిచ్లపై ఆడి 47, 60 పరుగులకు ఆలౌటైతే కూడా ఏమీ పట్టనట్లు ఉంటారు. పిచ్పై ఎవరూ ఎలాంటి విమర్శలు చేయరు. కానీ పిచ్ స్పిన్ అవడం మొదలైతే చాలు ఏడుపు మొదలుపెడతారు' అని లయన్ చాలా ఘాటుగా విమర్శించాడు.
డ్రా చేసుకున్నా..
స్పిన్నర్లకు సహకరిస్తున్న చెపాక్, మొతేరా వికెట్లపై.. కీపింగ్ చేయడం కష్టంగా ఉందని ఇంగ్లండ్ కీపర్ బెన్ ఫోక్స్ తెలిపాడు. ఇంతకుముందేప్పుడూ ఇలాంటి పిచ్లను చూడలేదని పేర్కొన్నాడు. తొలిరోజే ఐదో రోజులా ఉందని అభిప్రాయపడ్డాడు. మార్చి 4 నుంచి అహ్మదాబాద్లో నరేంద్రమోదీ స్టేడియంలో చివరి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన ఇంగ్లండ్.. నాలుగో టెస్టు గెలిచి సిరీస్ను సమం చేయాలని భావిస్తుంది. భారత్ చివరి టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ను 3-1తో చేజిక్కుంచుకోవాలని భావిస్తోంది.