
పూణే: స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న సుదీర్ఘ పర్యటనలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు అదరగొడుతున్న సంగతి తెలిసిందే. నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్ను 3-1తో గెలిచిన కోహ్లీసేన.. ఐదు మ్యాచుల టీ20 సిరీస్ను 3-2తో చేజిక్కించుకుంది. ఇక మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత ఆటగాళ్లు ఆదివారం పూణే చేరుకున్నారు. వీరికోసం బీసీసీఐ ప్రత్యేక చార్టర్డ్ ఫ్లయిట్ను కేటాయించింది. పూణే శివార్లలో ఉన్న ఎంసీఏ స్టేడియంలో తొలి వన్డే మంగళవారం జరుగుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 1.30కు ప్రారంభం కానుంది.
అయితే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకవైపు మ్యాచులు ఆడుతూనే.. మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వన్డే సిరీస్ కోసం అహ్మదాబాద్ విమానాశ్రయం చేరుకున్న సమయంలో నాన్న విధులలో కోహ్లీ బిజీగా ఉన్నాడు. అనుష్క శర్మ కూతురు వామికాను ఎత్తుకోగా.. విరాట్ మాత్రం హ్యాండ్బ్యాగులు, క్రికెట్ కిట్ మరియు తన కుమార్తె క్యారీకోట్ మోస్తూ కనిపించాడు. పూణే విమానాశ్రయంలో కూడా ఇదే రిపీట్ అయింది. దీనికి సంబందించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
వామికాకు సంబంధించి ఇంత వరకు ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు కోహ్లీ దంపతులు. బిడ్డను ఎత్తుకుని ఉన్న ఫోటోలను షేర్ చేశారు తప్ప.. పాప పూర్తిగా కనిపించేలా ఉన్న ఒక్క ఫోటోను కూడా ఇప్పటి వరకు షేర్ చేయలేదు. వామికా ఫోటో కోసం ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అహ్మాదాబాద్ విమానాశ్రయంలో కూడా చిన్నారి ముఖం కనిపించకుండా కవర్ చేసింది అనుష్క. దీంతో అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారు.
బాలీవుడ్ నటి అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ షాంఫూ యాడ్ షూటింగ్లో తొలిసారి కలుసుకుని.. ఐదారేళ్లు లవ్లో ఉన్నారు. 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు విరుష్క జోడి ప్రకటించింది. అనుష్క డెలివరీ సమయంలో ఆమె చెంత ఉండేందుకు పెటర్నటీ లీవ్పై కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే భారత్కి వచ్చేశాడు. గత జనవరి 11న కుమార్తెకు జన్మనిచ్చారు.
ఇక తొలిసారి వన్డే జట్టులోకి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ, కృనాల్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్తో పాటు హైదరాబాదీ పేసర్ మొహ్మద్ సిరాజ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. ఇక మూడు వన్డేల సిరీస్కు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. సిరీస్ కోసం 14 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఈసీబీ ప్రకటించగా.. మోచేతి గాయానికి గురైన ఆర్చర్ను పక్కన పెట్టింది. దీంతో జోఫ్రా ఇంగ్లండ్కు పయనం కానున్నాడు. కాగా ఐపీఎల్లో ప్రారంభ మ్యాచ్లకు సైతం అతడు అందుబాటులో ఉండడని ఈసీబీ ప్రకటించింది.