
చెన్నై: చెన్నై వేదికగా పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో భారీ ఓడిపోయింది. దీంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. గత ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్తో వెల్లింగ్టన్, క్రైస్ట్చర్చ్లో జరిగిన టెస్టులలో భారత్ ఓడిపోయింది. డిసెంబర్లో అడిలైడ్లో ఆస్ట్రేలియాతో జరిగిన పింక్-బాల్ టెస్టులో భారత్ ఓడిపోగా.. ఈరోజు చెన్నై వేదికగా ముగిసిన టెస్టులో పరాజయాన్ని చవిచూసింది. ఈ నాలుగు టెస్టులకు కోహ్లీ కెప్టెన్సీలోనే భారత్ ఓడిపోయింది. కెప్టెన్సీలో కోహ్లీ వరుసగా నాలుగు టెస్టుల్లో ఓటములు చవిచూడటం ఇదే ప్రథమం. అంతకుముందు అతడు వరుసగా ఏడు టెస్టుల్లో విజయాలు అందుకున్నాడు.
ఇంగ్లండ్ జట్టు టీమిండియా వరుస విజయాలకు చెక్ పెట్టింది. సొంతగడ్డపై గత 14 మ్యాచులలో ఓడిపోని భారత జట్టుకు ఇంగ్లీష్ టీమ్ ఓటమి రుచి చూపించింది. అంతేకాదు చెన్నైలో గత 8 మ్యాచులుగా టీమిండియాకు ఓటమేలేదు. ఇప్పుడు ఓటమిని ఎదుర్కొంది. ఇక గత పదేళ్లలో స్వదేశంలో టీమిండియా ఓడిన నాలుగో టెస్ట్ ఇదే. భారత్ చివరిసారిగా 2017 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టులో ఓడిపోయింది.
2014లో సారథిగా బాధ్యతలు అందుకున్న విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 57 టెస్టులకు నాయకత్వం వహించాడు. 33 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. 14 టెస్టుల్లో పరాజయాన్ని చవిచూశాడు. మరో 10 మ్యాచ్లు డ్రాగా ముగించాడు. భారత్ తరఫున ఎక్కువ టెస్టులకు కెప్టెన్సీ వహించిన రికార్డు ఎంఎస్ ధోనీ పేరిట ఉంది. మహీ 60 టెస్టుల్లో 27 విజయాలు, 18 ఓటములు, 15 డ్రాలు సాధించాడు. భారత అత్యుత్తమ సారథులలో సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ ఉన్నారు.
ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా దారుణ పరాజయంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు. టీమ్లోని ప్లేయర్స్ బాడీ లాంగ్వేజ్ బాగా లేదని, ఇంగ్లండ్పై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యారన్నాడు. అనుభవం లేని స్పిన్నర్లయిన సుందర్, నదీమ్ అంత సమర్థంగా బౌలింగ్ చేయలేకపోయారని చెప్పాడు. తొలి సగంలో వాళ్లపై మేము తగిన ఒత్తడి తీసుకురాలేకపోయామన్నాడు. పేస్ బౌర్లు, అశ్విన్ బాగా బౌలింగ్ చేశారని, అయితే తొలి ఇన్నింగ్స్లో కొన్ని పరుగులను మేము కట్టడి చేయాల్సింది అని కోహ్లీ అన్నాడు. రెండో టెస్ట్ చెన్నైలోనే ఫిబ్రవరి 13 నుంచి జరగనుంది. ఈ మ్యాచ్కు ఏడాది తర్వాత తొలిసారి ప్రేక్షకులను అనుమతించనున్నారు.