అహ్మదాబాద్: ఇంగ్లండ్తో నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం నుంచి మొతెరాలో ఆఖరి మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం టీమిండియా సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ను 'డ్రా' చేసుకున్నా భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించనున్న విషయం తెలిసిందే. ఇక చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు సాధన జోరుగా కొనసాగుతున్నది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో మంగళవారం జట్టు ఆటగాళ్లంతా నెట్స్లో చెమటోడ్చారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి టెస్టులో కొన్ని ఘనతలు అందుకునే అవకాశాలున్నాయి. భారత్ తరఫున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన ఎంఎస్ ధోనీ (60 టెస్టులు) రికార్డును అహ్మదాబాద్లో కోహ్లీ సమం చేయనున్నాడు. కెప్టెన్గానే కాదు బ్యాట్స్మన్గా కూడా కొన్ని రికార్డులు కోహ్లీ ముంగిట ఉన్నాయి. విరాట్ మరో 17 పరుగులు చేస్తే.. కెప్టెన్గా 12000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకుంటాడు. కోహ్లీ కన్నా ముందు రికీ పాంటింగ్ (15440), గ్రేమ్ స్మిత్ మాత్రమే (14878) ఈ ఘనత సాధించారు.
అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ చేస్తే కెప్టెన్గా అత్యధిక శతకాలు (అన్ని ఫార్మాట్లలో కలిపి) సాధించిన సారథిగా రికీ పాంటింగ్ (41)ను విరాట్ కోహ్లీ దాటేస్తాడు. ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే.. అత్యధిక విజయాలు సాధించిన టెస్టు సారథుల్లో గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41)ల తర్వాతి స్థానంలో ఉన్న క్లైవ్ లాయిడ్ (36)ను విరాట్ సమం చేస్తాడు. నాలుగో టెస్ట్ ద్వారా కోహ్లీ కచ్చితంగా ఓ రెండు రికార్డులను మాత్రం అందుకోనున్నాడు.
మొతేరాలో మూడో టెస్టు ముగిసి ఆరు రోజులవుతోంది. ఆ మ్యాచ్ జరుగుతున్నపుడు.. ఆ తర్వాత చర్చలన్నీ పిచ్ చుట్టూనే తిరిగాయి. గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టు ముంగిట కూడా మార్పేమీ లేదు. అందరి దృష్టీ పిచ్ మీదే ఉంది. ఈ మ్యాచ్కు వికెట్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే గత మ్యాచ్ మాదిరి చివరి టెస్టు రెండు రోజుల్లో అయితే ముగిసిపోదన్నది స్పష్టం. ఎందుకంటే ఈ మ్యాచ్కు ఎప్పట్లాగే ఎరుపు బంతి వాడుతున్నారు. కాబట్టి బ్యాటింగ్ మరీ కష్టం కాకపోవచ్చు. బౌలర్ల ఆధిపత్యం తగ్గొచ్చు. కానీ భారత కెప్టెన్ అజింక్య రహానే సహా కొందరు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే.. ఈ మ్యాచ్కూ వికెట్ స్పిన్నర్లకు అనుకూలంగానే ఉంటుంది.
India vs England: భారత జట్టులో చేరిన శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్!!