ఇదో అద్భుతమైన మ్యాచ్
మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ "ఇదో అద్భుతమైన మ్యాచ్. ఇలాంటి ఉత్కంఠకరమైన టెస్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. చాలా సార్లు పుంజుకున్నాం. ఎంతో తెగువ చూపించాం. ఇంగ్లాండ్ కనికరం లేకుండా ఆడింది. మేం పరుగులు తీసేందుకు చాలా కష్టపడేలా చేసింది" అని అన్నాడు.
ఇంగ్లాండ్లో మేం గొప్పగానే ఆటను ఆరంభించాం
"ఇంగ్లాండ్లో మేం గొప్పగానే ఆటను ఆరంభించాం. కానీ చివరికి నిరాశే మిగిలింది. ప్రతిరోజు ఆటను ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూసిన ఇంగ్లాండ్ విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుకు మా జట్టు దాదాపు చేరువగా రావడం సానుకూలాంశం. సుదీర్ఘ సిరీస్ను చక్కగా ఆరంభించినందుకు గర్వంగా ఉంది" అని కోహ్లీ పేర్కొన్నాడు.
షాట్ల ఎంపికే మా కొంప ముంచింది
"సిరీస్లో ముందంజ వేసి ఇక ముందు మేం ఏం చేయాలో చూపింది. షాట్ల ఎంపికే మా కొంప ముంచింది. బ్యాటింగ్ వైఫల్యమే మా ఓటమికి కారణం. జట్టు ఓడినా.. సానుకూల అంశాలతో రెండో టెస్టుకు సిద్ధమవుతాం. దాచిపెట్టాల్సిన విషయాలేం లేవు. బౌలర్లు రాణించినా, బ్యాట్స్మెన్ వైఫల్యం వల్లే ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్పై కోహ్లీ ప్రశంసల జల్లు
లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్పై విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. "తొలి ఇన్నింగ్స్లో లోయర్ ఆర్డర్ను చూసి ఎంతో నేర్చుకోవచ్చు. ఇషాంత్, ఉమేశ్ తెగువ చూపించారు. తొలి ఇన్నింగ్స్లో నాకు ఇషాంత్, రెండో ఇన్నింగ్స్లో పాండ్యకు ఉమేశ్ అండగా ఉన్నారు. మ్యాచ్ ఓడినా మేం సానుకూలంగా ఉన్నాం" అని కోహ్లీ వెల్లడించాడు.
తొలి టెస్టులో కోహ్లీ ఒక్కడే సెంచరీ
కాగా, భారత్ నుంచి విరాట్ కోహ్లీ (200 పరుగులు), హార్ధిక్ పాండ్యా (53 పరుగులు) మాత్రమే రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 50కి పరుగులు చేసిన బ్యాట్స్మెన్. ఇంగ్లండ్ జట్టు నుంచి మొత్తం ముగ్గురు హాఫ్ సెంచరీలు చేయగా, భారత్ నుంచి కోహ్లి మాత్రమే సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించాడు. కోహ్లీ ఔటయ్యాక భారత్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయి ఆలౌటైంది.