యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సీనియర్లను జట్టులోకి తీసుకోలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఇంగ్లాండ్తో స్వదేశంలో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఉప్పల్ వేదికగా రేపు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సారథి రోహిత్ శర్మ పాల్గొన్నాడు. ఆసక్తికర అంశాలను వివరించాడు.
వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లి దూరమవ్వడంతో సీనియర్ చెతేశ్వర్ పుజారా జట్టులోకి వస్తాడని భావించారంతా. ఎందుకంటే రంజీ ట్రోఫీలో పుజారా సత్తాచాటుతున్నాడు. జార్ఖండ్పై డబుల్ సెంచరీతో పాటు నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. కానీ కోహ్లి స్థానంలో యువ బ్యాటర్ రజత్ పటిదార్ జట్టులోకి వచ్చాడు. దీనిపై రోహిత్ స్పందిస్తూ.. ''అనుభవజ్ఞులైన ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోకపోవడం కష్టతరమే. వాళ్లు జట్టుకు అందించిన విజయాలు, సాధించిన పరుగులు, వాళ్ల అనుభవాన్ని విస్మరించడం చాలా కష్టమే'' అని పేర్కొన్నాడు.

కానీ యువ ప్లేయర్లుకు విదేశాల్లో కాకుండా అనుకూలమైన పరిస్థితుల్లో అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకున్నామని రోహిత్ తెలిపాడు. అయితే ఎవరికైనా టీమిండియా తలుపు తట్టే అవకాశం ఉందని, ఫిట్నెస్ కాపాడుకుంటూ మెరుగైన ప్రదర్శన చేస్తే తిరిగిరావొచ్చని అన్నాడు. మరోవైపు తుది జట్టు ఎంపిక తనకు తలనొప్పిగా మారిందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్లలో ఎవరిని సెలక్ట్ చేయాలో తెలియట్లేదని చెప్పాడు.
''వికెట్ బౌన్స్కు సహకరించినా, సహకరించకపోయినా కుల్దీప్ ఎక్స్ ఫ్యాక్టర్గా ఉంటాడు. అద్భుతమైన వైవిధ్యాలతో బంతులు సంధిస్తాడు. ఎంతో తెలివైన బౌలర్. అయితే అశ్విన్, జడేజా గొప్ప ప్రదర్శనల కారణంగా భారత్లో కుల్దీప్ టెస్టులు ఆడే అవకాశం పెద్దగా రాలేదు. మరోవైపు అక్షర్ గొప్ప ఆల్రౌండర్. అతడి రాకతో లోయర్ ఆర్డర్ బలోపేతంగా మారుతుంది. ఇక్కడి పరిస్థితుల్లో ప్రత్యేకంగా టెస్టుల్లో అతడు నిలకడైన ప్రదర్శనతో సత్తాచాటుతున్నాడు. అతడు కూడా మాకు కీలకమే. వారిద్దరిలో ఒకరినే ఎంచుకోవాల్సి వస్తుంది. ఇది మాకు తలనొప్పిగా మారింది'' అని రోహిత్ వివరించాడు. కాగా, రేపు ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.