
ముంబై: భారత గడ్డపై ఇటీవల ముగిసిన భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీసు అరుదైన ఘనత సాధించింది. వీక్షణ (వ్యూయర్షిప్) పరంగా ఐదేళ్ల క్రితంనాటి రికార్డును బద్దలుకొట్టింది. ఎంతో ఆసక్తికరంగా సాగిన టెస్టు సిరీస్ను ఏకంగా 10.3 కోట్ల మంది వీక్షించారు. నిమిషానికి సగటు వీక్షకుల (ఏఎంఏ) సంఖ్య 10.3 లక్షలుగా నమోదైందని స్టార్ ఇండియా హెడ్ సంజోగ్ గుప్తా తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి ముప్పుతో దాదాపుగా ఏడాది తర్వాత భారత గడ్డపై క్రికెట్ ఆరంభమైన సంగతి తెలిసిందే.
స్టార్ ఇండియా హెడ్ సంజోగ్ గుప్తా మాట్లాడుతూ... 'టెస్ట్ సిరీస్కు భారీ స్పందన రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. కరోనా కారణంగా దాదాపు ఒక సంవత్సరం తరువాత భారతదేశంలో అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభం కావడం, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ను ప్రవేశపెట్టడంతో సుదీర్ఘ ఫార్మాట్పై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలోనే టెస్టు సిరీస్కు భారీ స్థాయిలో వీక్షణలు లభించాయి. నాలుగు ప్రాంతీయ భాషలలో ప్రసారం కూడా కలిసివచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఆనందాన్నే ప్రేక్షకులకు అందిస్తుంటాం' అని తెలిపారు.
నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్లో భాగంగా చెన్నైలో తొలుత ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ ద్విశతకంతో దుమ్మురేపాడు. దాంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. చెన్నైలోనే జరిగిన రెండో టెస్టులో స్పిన్ అస్త్రం ప్రయోగించిన భారత్.. సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక కొత్త మైదానం మొతేరాకు వచ్చాకా జైత్రయాత్ర కొనసాగించింది. డే/నైట్ టెస్టును రెండున్నర రోజుల్లోనే ముగించి ఆధిక్యంలోకి వెళ్ళింది. నాలుగో టెస్టులోనూ ఘన విజయం సాధించి.. సొంతగడ్డపై తమకు తిరుగులేదని నిరూపించింది.
ఆఖరి టెస్టులోనూ విజయం సాధించిన భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్కు అర్హత సాధించింది. ఇక న్యూజిలాండ్తో ఫైనల్ పోరులో కోహ్లీసేన తలపడనుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ను ప్రవేశపెట్టడంతో సుదీర్ఘ ఫార్మాట్పై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలోనే భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు భారీ స్థాయిలో వీక్షణలు లభించాయి. పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీసులకూ మునుపటి రికార్డులు బద్దలవుతాయని అంచనా వేస్తున్నారు. టీ20లు కూడా ఆసక్తికరంగా సాగుతున్న విషయం తెలిసిందే.