
హైదరాబాద్: టీమిండియా మరో కీలక సమరానికి సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్తో మొదలయ్యే ఐదు టెస్ట్ల సుదీర్ఘ సిరీస్ కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు సమాయత్తమవుతున్నది. సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనను విజయంతో ప్రారంభించిన టీమిండియా మూడు టీ20ల సిరిస్ను 2-1తో కైవసం చేసుకుంది.
అయితే, ఆ తర్వాత జరిగిన మూడు వన్డేల సిరిస్ను 1-2తేడాతో చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఐదు టెస్టుల సిరీస్లో భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2014లో చివరిసారిగా ఇంగ్లాండ్తో ఆ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడిన టీమిండియా 1-3 తేడాతో చిత్తుగా ఓడింది.
దీంతో గత పదేళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న టెస్ట్ సిరీస్ విజయాన్ని ఈసారి ఎలాగైనా ఒడిసిపట్టుకోవాలన్న పట్టుదలతో కోహ్లీసేన సన్నద్ధమవుతోంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆగస్టు 1న బర్మింగ్ హామ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
అయితే, ఈ టెస్టుకు ముందు టీమిండియా ఓ సన్నాహాక మ్యాచ్ ఆడనుంది. బుధవారం నుంచి ఎసెక్స్ జట్టుతో జరగనున్న నాలుగు రోజుల అనధికారిక మ్యాచ్లో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం టీమిండియా నెట్స్ తీవ్రంగా శ్రమించింది. ఎసెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్లో భారత క్రికెటర్లు సాధన చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీసీసీఐ పోస్టు చేసిన వీడియోలో టెస్టు జట్టుతో కలిసిన సీనియర్ స్పిన్నర్ అశ్విన్, రవీంద్ర జడేజా తదితరులు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సాధన చేశారు. ఐదు టెస్ట్లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభమవుతాయి.
తొలి మూడు టెస్ట్లకు ఎంపిక చేసిన భారత జట్టులో విరాట్ కొహ్లీ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మురళీ విజయ్, పుజారా, రహానే, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ ఉన్నారు.