

హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరిస్ ముగిసింది. ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొదటి మూడు టెస్టులకు భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన టీమిండియాను బుధవారం సెలక్టర్లు ప్రకటించారు.
యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు తొలిసారి టెస్టు జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు. వృద్ధిమాన్ సాహా గాయపడటంతో అతని స్థానంలో పంత్కు ఓ అవకాశం ఇచ్చారు. మరోవైపు దినేష్ కార్తీక్ను ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా ఎంపిక చేశారు. బొటన వేలి గాయంతో ఇంగ్లాండ్ టీ20, వన్డే సిరిస్కు దూరమైన బుమ్రాకు కూడా చోటు దక్కింది.
గాయం నుంచి కోలుకోగానే అతడు టెస్టు జట్టుతో చేరనున్నాడు. బుమ్రాను జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ అతను రెండో టెస్ట్ నుంచి తుది జట్టు ఎంపికకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. మూడో వన్డేలో గాయపడిన భువనేశ్వర్ కుమార్కు సెలక్టర్లు జట్టులో చోటు కల్పించలేదు.
భువనేశ్వర్ కుమార్ వెన్ను గాయం మరింత ఎక్కువైందని, టెస్టు జట్టులోకి అతన్ని తీసుకోవాలా వద్ద అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని ఆ ప్రకటనలో బోర్డు చెప్పింది. ఇక యో-యో టెస్టులో పాసైన పేస్ బౌలర్ మహ్మద్ షమికి కూడా టెస్టు జట్టులో సెలక్షన్ కమిటీ చోటు కల్పించింది. ఆగస్టు 1న ఎడ్బాస్టన్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.
ఇంగ్లాండ్తో మొదటి మూడు టెస్టులకు టీమిండియా:
కోహ్లీ, ధావన్, రాహుల్, విజయ్, పుజారా, రహానే, కరుణ్ నాయర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్