
అహ్మదాబాద్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. చివరి రెండు టెస్టులు జరిగిన అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలోనే 5 టీ20ల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా.. టెస్టుల్లోలానే టీ20ల్లో కూడా ఇంగ్లండ్ను చిత్తుచేయాలని ఉవ్విళ్లూరుతోంది. కనీసం పొట్టి సిరీస్లోనైనా నెగ్గి.. లెక్క సరిచేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ప్రపంచ టీ20 ర్యాకింగ్స్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఇయాన్ మోర్గాన్ సేనను ఆపడం భారత బౌలర్లకు అంత సులువు కాదు. మ్యాచులు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
ఇప్పటివరకు భారత్-ఇంగ్లండ్ జట్లు 14 సార్లు టీ20ల్లో తలపడ్డాయి. అయితే ఇరు జట్లు సరిసమానంగా విజయాలు సాధించాయి. 7 సార్లు టీమిండిగా గెలిస్తే.. 7 సార్లు ఇంగ్లండ్ విజయం సాధించింది. అయితే స్వదేశంలో జరిగిన మ్యాచ్లలో రెండు జట్లూ ఎక్కువ శాతం గెలిచాయి. కాగా ఇంగ్లండ్, భారత్ కాకుండా బయటి పిచ్లపై జరిగిన మ్యాచ్లలో మాత్రం ఇంగ్లండ్పై భారత్ పూర్తిస్థాయి పైచేయి సాధించింది. 2007లో డర్బన్లో జరిగిన టీ20లోనూ, కొలంబోలో 2012లోనూ ఇంగ్లండ్పై టీమిండియా విజయం సాధించింది.
ఇక చివరిగా 2018లో ఇంగ్లండ్లోని బ్రిస్టోల్లో జరిగిన టీ20 మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టును టీమిండియా చిత్తుచిత్తుగా ఓడించింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన మరో 8 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ శతకంతో మెరవడమే కాకుండా.. నాటౌట్గా చివరివరకు క్రీజులో పాతుకుపోయాడు. దీంతో టీమిండియా ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 43, హార్దిక్ పాండ్యా 33 రన్స్ చేశారు. ఇంగ్లీష్ ఓపెనర్ జేసన్ రాయ్ (67) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
భారత టీ20 జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ , ఇషాన్ కిషన్, యుజ్వేందర్ చహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్.
ఇంగ్లండ్ టీ20 జట్టు:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కర్రన్, టామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలాన్, అదిల్ రషీద్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, మార్క్ వుడ్.