
అహ్మదాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన పర్యటనలో పేసర్ టీ నటరాజన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే స్వదేశానికి తిరిగొచ్చాక గాయపడడంతో.. ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్తో పాటు ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్కు అతడు దూరమయ్యాడు. తాజాగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అకాడమీలో నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో పాసైన నటరాజన్.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో చోటు దక్కించుకున్నాడు.
టీ నటరాజన్ గురువారం టీమిండియా జట్టుతో కలిశాడు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంటూ.. ట్విటర్ వేదికగా టీమిండియా జెర్సీని ధరించి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. 'మనకు నచ్చిన వృత్తిలో ఉంటే.. జీవితంలో ఒక్కరోజు కూడా పని చేయకుండా ఉండలేం. చాలా రోజుల తర్వాత బ్లూ జెర్సీ వేసుకోవడం థ్రిల్లింగ్గా అనిపించింది' అని నటరాజన్ ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు నటరాజన్తో పాటు సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ద కృష్ణ కూడా ఎంపికయిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2020 సీజన్లో సన్రైజర్స్ తరపున 16 వికెట్లతో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకొని.. టీ నటరాజన్ అందరి ప్రశంసలు పొందాడు. ఈ ప్రదర్శనే ఆసీస్ పర్యటనకు అతన్ని నెట్ బౌలర్గా అవకాశం కల్పించింది. అయితే అనూహ్యంగా నటరాజన్ మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. దీంతో భారత్ తరఫున ఈ రికార్డు సృష్టించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 17వ ఆటగాడిగా నిలిచాడు. టెస్టుల్లో 100వ క్యాప్ను బాలూ గుప్తే (1960-61) ధరించగా, 200వ టెస్టు క్యాప్ను నయాన్ మోంగియా (1993-94) అందుకున్నాడు. నట్టూ 300వ క్యాప్ను ధరించాడు.
మొదటగా నవదీప్ సైనీ గాయపడడంతో నటరాజన్కు అదృష్టం తలుపు తట్టింది. ఆసీస్తో జరిగిన మూడో వన్డేతో ఎంట్రీ ఇచ్చిన నటరాజన్.. రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్లో మొత్తంగా ఆరు వికెట్లు (3, 2, 1) తీసి అందరి చేత ప్రశంసలు పొందాడు. ఇక గబ్బా వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఆడిన నటరాజన్.. తొలి టెస్టులోనే 3 వికెట్లు తీసి తానేంటో నిరూపించాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంగ్లండ్తో వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.