
హైదరాబాద్: ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా ఓడిపోవడానికి కారణాలు అనేకం. ఈ సిరీస్లో ఇరు జట్లకు మరపురాని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తొలి సెంచరీ సాధించాడు. టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన రిషబ్ పంత్ కూడా ఒకే ఇన్నింగ్స్లో(అరంగేట్రం మ్యాచ్లో) అత్యధిక క్యాచ్లు.. భారత కీపర్ ఇంగ్లాండ్ గడ్డపై తొలి సెంచరీ సాధించడం వంటి రికార్డుల సృష్టించాడు.
ఒకే సిరీస్లో అత్యధిక క్యాచ్లు(14) పట్టిన ఘనతను ఓపెనర్ కేఎల్ రాహుల్ సాధించాడు. ఇక మరోవైపు ఆతిథ్య జట్టుకు కూడా ఈ సిరీస్ చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. ఈ సిరీస్లోనే సీనియర్ ఆటగాడు, ఓపెనర్ అలెస్టర్ కుక్ రిటైర్మెంట్ ప్రకటించడం, బ్రిటీష్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ మెక్గ్రాత్ రికార్డును సవరించాడు.
ఈ సిరీస్ ఇంగ్లాండ్ గెలిచిన అనంతరం గాడ్ ఆఫ్ క్రికెట్, టీమిండియా మాజీ లెజండరీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. 'ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు టెస్టు సిరీస్ గెలిచినందుకు అభినందనలు. రిటైర్మెంట్ అనంతరం కూడా అలిస్టర్ కుక్ జీవితం బాగుండాలి. ఈ సిరీస్ ఇంగ్లాండ్ గెలవడంలో స్యామ్ కుర్రాన్ కీలకపాత్ర పోషించాడు. కుర్రాన్ స్మార్ట్ థింకర్' అంటూ సచిన్ ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ సిరీస్లో అనుభవం లేని కుర్రాన్ వీరోచితంగా ఆడాడు.
తొలి టెస్టు కోహ్లి సేన ఓడిపోవడానికి అతడే కారణమనుకోవాలి. ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఐదు వికెట్లు తీయడమే కాకుండా రెండో ఇన్నింగ్స్లో 63 పరుగులు సాధించడంతో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమిచవిచూసింది. మిగిలిన టెస్టుల్లోనూ కుర్రాన్ తన మార్క్ చూపించాడు. ఈ సిరీస్లో అతడి ప్రతిభ చూసిన సచిన్ కూడా కుర్రాన్ స్మార్ట్ థింకర్ అంటూ ప్రశంసించాడు కాబోలు.