వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో లంచ్ విరామానికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. 31 ఓవర్లకు 103/2 స్కోరు సాధించింది. క్రీజులో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (51; 92 బంతుల్లో), శ్రేయస్ అయ్యర్ (4; 7 బంతుల్లో) ఉన్నారు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు శుభారంభం దక్కలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. 41 బంతులు ఎదుర్కొని 14 పరుగులు చేసి ఔటయ్యాడు.
అరంగేట్ర బౌలర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో రోహిత్ లెగ్ స్లిప్లో ఒలీ పోప్ చేతికి చిక్కాడు. గత ఏడు టెస్టు ఇన్నింగ్స్ల్లో రోహిత్ ప్రదర్శన పేలవంగా ఉండటం గమనార్హం. మరోవైపు ఫామ్ కోల్పోయినా అవకాశాలు పొందుతున్న యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ మరోసారి విఫలమయ్యాడు. అయితే ఆడినంతసేపు సాధికారికంగానే బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో అయిదు బౌండరీలతో 34 పరుగులు చేశాడు.

కానీ, తిరిగి లయను అందుకున్నాడని భావించే తరుణంలోనే వికెట్ను చేజార్చుకున్నాడు. అండర్సన్ వేసిన బంతిని ఢిఫెండ్ చేయడానికి ప్రయత్నించి వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ చేతికి చిక్కాడు. అయితే గిల్ను ఏడు ఇన్నింగ్స్ల్లో అండర్సన్ అయిదు సార్లు ఔట్ చేయడం గమనార్హం. ఏడు ఇన్నింగ్స్ల్లో అండర్సన్ వేసిన 72 బంతులు ఎదుర్కొన్న గిల్ 39 పరుగులే చేశాడు. 7.80 సగటుతో మాత్రమే పరుగులు చేసి అయిదు సార్లు వికెట్లు సమర్పించుకున్నాడు.
గతేడాది వరల్డ్ టెస్టు ఛాంపియనషిప్ ఫైనల్ అనంతరం టెస్టుల్లో గిల్ ప్రదర్శన దారుణంగా ఉంది. 12 ఇన్నింగ్స్ల్లో 207 పరుగులే చేశాడు. 18 సగటుతో బ్యాటింగ్ చేశాడు. అత్యధిక స్కోరు 36 పరుగులు.ఈ నేపథ్యంలో గిల్పై మరోసారి నెట్టింట్లో విమర్శలు మొదలయ్యాయి. అవకాశాలు తీసుకుంది చాలు అని, దేశవాళీ క్రికెట్లో సత్తాచాటి తిరిగి టెస్టుల్లోకి రమ్మని కామెంట్లు చేస్తున్నారు. అండర్సన్ బౌలింగ్లో అయిదు సార్లు గిల్ ఔట్ గురించి స్పందిస్తూ.. ఒకే బౌలర్ చేతిలో అత్యధికసార్లు ఔటవ్వడం రికార్డు కోసం ప్రయత్నిస్తున్నావా అంటూ వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. కాగా, అండర్సన్ బౌలింగ్లో సచిన్ టెండూల్కర్ తొమ్మిదిసార్లు ఔటవ్వగా, విరాట్ కోహ్లి ఏడు సార్లు వికెట్ సమర్పించుకున్నాడు.