టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ శతకం సాధించాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో 132 బంతుల్లో సెంచరీని బాదాడు. గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయినా గిల్ ఎట్టకేలకు తిరిగి లయను అందుకున్నాడు. తనపై వస్తున్న విమర్శకులకు బ్యాటుతోనే సమాధానం చెప్పాడు. ఇవాళ ఆటలో లంచ్ బ్రేక్ వరకు నిదానంగా ఆడిన గిల్ రెండో సెషన్లో చెలరేగాడు. దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డులో పరుగులు పెట్టించాడు. టెస్టు ఫార్మాట్లో గిల్కు ఇది మూడో సెంచరీ.
రెహాన్ అహ్మద్ వేసిన ఓవర్లో వరుసగా సిక్సర్, రెండు ఫోర్లతో విజృంభించాడు. అయితే ప్రతిబంతిని దాడి చేయకుండా అంచనా వేస్తూ గొప్పగా ఆడుతున్నాడు. సాధికారికంగా పరుగులు చేస్తున్నాడు. అయితే గతేడాది వరల్డ్ టెస్టు ఛాంపియనషిప్ ఫైనల్ అనంతరం టెస్టుల్లో గిల్ పరుగులు చేయలేక విఫలమయ్యాడు. ఈ ఇన్నింగ్స్ మినహాయిస్తే 12 ఇన్నింగ్స్ల్లో 207 పరుగులే చేశాడు. 18 సగటుతో బ్యాటింగ్ చేయడంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని వాదనలు వినిపించాయి.

కాగా, ఓవర్నైట్ స్కోరు 28/0తో మూడో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13; 21 బంతుల్లో), డబుల్ సెంచరీ హీరో యశస్వీ జైస్వాల్ (17; 27 బంతుల్లో)ను ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ పెవిలియన్కు చేర్చడంతో 30 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ (29; 52 బంతుల్లో)తో కలిసి గిల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు మూడో వికెట్కు 81 పరుగులు జోడించి టీమిండియాను పటిష్టస్థితిలో నిలబెట్టారు. కానీ బెన్ స్టోక్స్ అద్భుతమైన క్యాచ్కు శ్రేయస్ వెనుదిరగాల్సి వచ్చింది.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన రజత్ పటిదార్ (9) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయినప్పటికీ ఇంగ్లండ్కు గిల్ అవకాశం ఇవ్వలేదు. అక్షర్ పటేల్ (33)తో కలిసి పరుగులు సాధిస్తున్నాడు.