అహ్మదాబాద్: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ అనంతరం జరిగే టీ20 సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమవుతున్నది. అహ్మదాబాద్లోని మొతేరా మైదానంలో మార్చి 12 నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆరంభంకానుంది. ఇటీవల 19 మందితో కూడిన భారత్ జట్టుని బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టీమ్లోని కొంత మంది భారత క్రికెటర్లు ప్రస్తుతం అహ్మదాబాద్ వేదికగానే టెస్టు సిరీస్ ఆడుతుండగా.. మిగిలిన ఆటగాళ్లు తాజాగా టీమిండియా మేనేజ్మెంట్కి అహ్మదాబాద్లో రిపోర్ట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే టీ20 సిరీస్కు ఎంపికైన టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ జట్టులో చేరారు. టీమిండియాలోకి రావడం గొప్పగా అనిపిస్తోందని గబ్బర్ ట్విటర్లో పేర్కొన్నాడు. అయ్యర్తో దిగిన ఫొటోను ధావన్ షేర్ చేశాడు. ఈ ఇద్దరు దాదాపు మూడు నెలల తర్వాత భారత జట్టులోకి వచ్చారు. 2020 నవంబర్-డిసెంబర్లో ఆస్ట్రేలియాలో పరిమిత ఓవర్ల సిరీస్లో వారు చివరిసారిగా ఆడారు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో శిఖర్ ధావన్ వీరవిహారం చేశాడు. ఢిల్లీ తరఫున ఇటీవల మ్యాచ్లాడిన ధావన్.. మహారాష్ట్రతో జరిగిన ఓ మ్యాచ్లో 118 బంతుల్లో 153 పరుగులు చేశాడు.
Playing it cool with Mr Iyer 😎 Great to be back with Team India 🇮🇳 @ShreyasIyer15 pic.twitter.com/DKYgo2gf0k
— Shikhar Dhawan (@SDhawan25) March 2, 2021
భారత టీ20 జట్టులోకి ఎంపికైన ఆటగాళ్లందరూ మార్చి 1 తర్వాత టీమిండియా మేనేజ్మెంట్కి రిపోర్ట్ చేయాలని ఇటీవల బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. టీ20 జట్టు సభ్యులందరూ మొదటగా క్వారంటైన్ను పూర్తిచేస్తారు. అనంతరం క్రికెటర్లకి కరోనా వైరస్ పరీక్షల తర్వాత అందరూ బయో-సెక్యూర్ బబుల్లోకి అనుమతించనున్నారు. 12, 14, 16, 18, 20 తేదీల్లో టీ20 మ్యాచులు జరగనున్నాయి. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.
భారత టీ20 జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్.
విదేశీ పిచ్లపై మేమెప్పుడూ వ్యాఖ్యలు చేయలేదు.. నాలుగో టెస్టుకు స్పిన్ పిచ్ సిద్ధం: రహానే