దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చేతుల మీదగా టీమిండియా టెస్టు క్యాప్ను అందుకున్నాడు.
అయితే ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.భారత్ తరఫున అరంగేట్రం చేసే సమయానికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక బ్యాటింగ్ సగటు ఉన్న ఆరో భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో వినోద్ కాంబ్లీ ఉన్నాడు. అతడు టీమిండియాలో అడుగుపెట్టే ముందు 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 88.37 సగటుతో పరుగులు చేశాడు. సర్ఫరాజ్ 45 మ్యాచ్ల్లో 69.85 ఏవరేజ్తో రన్స్ చేశాడు.

వినోద్ కాంబ్లీ తర్వాత ప్రవీణ్ అమ్రీ (81.23 సగటు, 23 మ్యాచ్లు), యశస్వీ జైస్వాల్ (80.21 సగటు, 15 మ్యాచ్లు), రుషి మోడీ ( 71.28 సగటు, 38 మ్యాచ్లు), సచిన్ టెండూల్కర్ (70.18 సగటు, 9 మ్యాచ్లు), సర్ఫరాజ్ ఖాన్ (69.85 సగటు, 45 మ్యాచ్లు), శుభ్మన్ గిల్ (68.78 సగటు, 23 మ్యాచ్లు) ఉన్నారు.
అయితే వాళ్లందరిలో సర్ఫరాజ్ అత్యధిక మ్యాచ్లు ఆడాడు. అంటే టీమిండియాలో చోటు దక్కడం కోసం అందరికంటే ఎక్కువ రోజులు ఎదురుచూసింది అతడే. కాగా, రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో సర్ఫరాజ్ ఇంకా బ్యాటింగ్కు రాలేదు. వాస్తవానికి అతడు అయిదో స్థానంలో బరిలోకి దిగాలి. కానీ 33 పరుగులకు భారత్ మూడు వికెట్లు కోల్పోయింది.
అరంగేట్ర మ్యాచ్లోనే ఒత్తిడిలో సర్ఫరాజ్ ఖాన్ను బ్యాటింగ్కు పంపించవద్దని, రవీంద్ర జడేజాను టీమిండియా యాజమాన్యం బరిలోకి దించింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (39*), జడేజా (11* ) క్రీజులో ఉన్నారు. యశస్వీ జైస్వాల్ (10; 10 బంతుల్లో), శుభ్మన్ గిల్ (డకౌట్; 9 బంతుల్లో), రజత్ పటిదార్ (5; 15 బంతుల్లో) విఫలమయ్యారు. జైస్వాల్, గిల్ను మార్క్ వుడ్ ఔట్ చేయగా, రజత్ను టామ్ హర్ట్లీ బోల్తాకొట్టించాడు.