
అహ్మదాబాద్: మొతేరా వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 224 రన్స్ చేసి.. ఇంగ్లండ్ ముందు 225 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. స్టార్ ఓపెనర్ 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ (64; 34 బంతుల్లో 4×4, 5×6) వీరవిహారం చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (64 నాటౌట్; 52 బంతుల్లో 7×4, 2×6) క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. రెండో మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (32; 17 బంతుల్లో 3×4, 2×6), ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (39; 17 బంతుల్లో 4×4, 2×6) మెరుపులు మెరిపించారు. ఇంగ్లండ్పై భారత్కు ఇదే అత్యధిక టీ20 స్కోరు. ఇంగ్లీష్ బౌలర్లలో రషీద్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య బ్యాట్స్మెన్.. గత నాలుగు మ్యాచ్లకు భిన్నంగా ఈ మ్యాచ్లో దుమ్మురేపారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల సునామీ సృష్టించారు. ముఖ్యంగా రోహిత్ సిక్సులు, ఫోర్లతో బెంబేలెత్తించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్.. 30 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సామ్ కరన్ వేసిన 8వ ఓవర్ ఆఖరి బంతిని ఫైన్ లెగ్లోకి భారీ సిక్సర్ బాదేసి అర్ధ శతకం అందుకున్నాడు.
అర్ధ శతకం అందుకున్న అనంతరం కూడా రోహిత్ శర్మ జోరు కొనసాగించాడు. ఓ సిక్స్, ఫోర్ బాది మంచి టచ్లో కనిపించాడు. అయితే 9వ ఓవర్లో బెన్ స్టోక్స్.. ఓ అద్భుత బంతితో హిట్మ్యాన్ను బోల్తా కొట్టించాడు. ఆ ఓవర్ చివరి బంతిని వేగం తగ్గించి స్టోక్స్ వేయగా.. రోహిత్ బ్యాటు అంచుకు తగిలి వికెట్లను తాకేసింది. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడగా ఆడాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు.
సూర్యకుమార్ యాదవ్ కూడా బౌండరీలతో మోతెక్కించాడు. క్రిస్ జోర్డాన్ వేసిన 12 ఓవర్లో ఆఖరి మూడు బంతుల్ని వరుసగా బౌండరీకి పంపించేశాడు. తొలి బంతికి కోహ్లీ బౌండరీ బాడడంతో ఆ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. అయితే 13వ ఓవర్లో స్టోక్స్ 9 పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని కోహ్లీ లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాదేశాడు. నెమ్మది బంతినీ అతడు స్టాండ్స్లోకి పంపించడం గమనార్హం. ఆ తర్వాత స్టోక్స్ తెలివిగా బంతులేశాడు. సూర్య, కోహ్లీ ధాటిగా ఆడడంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగింది.
అయితే రషీద్ వేసిన 13.2వ బంతికి సూర్య (37; 17 బంతుల్లో 3×4, 2×6) ఔటయ్యాడు. బౌండరీ లైన్ వద్దకు వెళ్లిన బంతిని పరుగెత్తుకుంటూ వచ్చిన జోర్డాన్ ఒంటి చేత్తో అందుకున్నాడు. బ్యాలెన్స్ తప్పుతున్నాడని తెలిసి అక్కడే వున్న జేసన్ రాయ్కి విసిరాడు. నమ్మలేని సూర్య నిరాశగా మైదానం వీడాడు. అనంతరం హార్దిక్ పాండ్యా.. కోహ్లీకి జతకలిశాడు. బంతిని ఎలా వేసినా బౌండరీ బాదాలనే కసితో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే కోహ్లీ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ఆపై కూడా భారీ షాట్లతో అలరించాడు. హార్దిక్ కూడా ఆకలిగొన్న పులిలా విరుచుకుపడడంతో భారత్ తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. వుడ్, ఆర్చర్, జోర్డాన్, కరన్, స్టోక్స్కు ఏం చేయాలో అర్థంకాక విలవిల్లాడారు. ఓవరుకు 10+ పరుగులు ఇచ్చేశారు.