
అహ్మదాబాద్: మొతేరా స్టేడియంలో ఇంగ్లండ్తో జరగబోయే చివరిదైన నాలుగో టెస్టు గురువారం నుంచి ప్రారంభంకానుంది. నాలుగో టెస్టు కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఆదివారం భారత ఆటగాళ్లు నెట్ సెషన్లో సాధన చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ సాధన చేయగా.. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఇక వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఫీల్డింగ్ డ్రిల్స్తో బిజీగా గడిపాడు. ఈ నేపథ్యంలో పిచ్ ఎలా ఉండనుందనే విషయంపై రోహిత్ శర్మ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ప్రాక్టీస్ సమయంలో మైదానంలో పడుకొని పిచ్ను చూస్తున్న ఓ ఫొటోను రోహిత్ శర్మ ఇన్స్టాలో అభిమానులతో పంచుకున్నాడు. 'నాలుగో టెస్టుకు పిచ్ ఎలా ఉండనుందనే విషయంపై ఆశ్చర్యపోతున్నా' అని కాప్షన్ పెట్టాడు. ఈ ఫొటో చూసిన రోహిత్ భార్య రితిక అతన్ని ట్రోల్ చేసింది. ఆ ఫొటోకు రిప్లై ఇస్తూ.. 'మళ్లీ నేను బద్దకంగా ఉంటే ఎగతాళి చేస్తావ్' అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
గతవారం జరిగిన డేనైట్ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడంతో మొతేరా పిచ్పై అనేక విమర్శొలొచ్చాయి. భారత్ తమకు అనుకూలంగా ఉండే స్పిన్ పిచ్ను రూపొందించుకుందని, టెస్టు క్రికెట్కు ఇలాంటి వికెట్ పనికిరాదని పలువురు మాజీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇంగ్లీష్ మాజీలు మండిపడ్డారు. దీనికి భారత ఆటగాళ్లు సైతం అంతే దీటుగా బదులిచ్చారు. రోహిత్ శర్మ మాట్లాడుతూ విదేశాల్లో తాము క్రికెట్ ఆడేటప్పుడు పేస్కు అనుకూలించే పిచ్లపై ఎప్పుడూ ఫిర్యాదులు చేయలేదన్నాడు.
ఇప్పటికే మొతేరా మైదానంలో మూడో టెస్టు గెలిచిన కోహ్లీసేన చివరి మ్యాచ్లోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు రూట్ సేన సైతం ఈ మ్యాచ్లో గెలుపొంది సిరీస్ డ్రా చేసుకోవాలని తాపత్రయ పడుతోంది. అయితే మొతేరా మరోసారి స్పిన్ బౌలర్లకే అనుకూలించనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఎలా ఆడుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వ్యక్తిగత కారణాలతో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా చివరి టెస్ట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.